తెలంగాణ ప్రభుత్వం మరో బాధుడుకు సిద్ధమయ్యిందా? కోర్టు తీర్పుపై ఆధారపడిన కొత్త పథకాన్ని అమలు చేసేందుకు ఈ బాధుడే లక్ష్యంగా పెట్టుకుందా ? అప్పులు పుట్టకపోవడంతో అదే మార్గంగా కెసిఆర్ సర్కార్ భావిస్తోందా ? ఇంతకీ ఏంటా కొత్త బాధుడు ? అది అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తున్న ప్రణాళికలు ఏమిటి ?
ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలంగాణ సర్కార్ మరో బాధుడుకు సిద్ధమయ్యింది. గత కొంతకాలంగా న్యాయస్థానంలో ఉన్న ఓ పథకానికి సంబంధించి తుది తీర్పు రానున్న నేపధ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే వెంటనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా 2015లో ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టింది. అయితే రెగ్యులరైజేషన్ పేరుతో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని, అక్రమాలకు పాలపడిన వారిని, రియల్ ఎస్టేట్ సంస్థలని వదిలేసు సామాన్యులను వేధిస్తున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఈ పథకం అమలు కాకుండానే నిలిచిపోయింది.
అయితే తాజాగా లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ప్లాట్ల క్రమబద్దీకరణ త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు తీర్పు కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై దృష్టి సారిస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి దరఖాస్తుల పరిశీలనను కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసిందని టాక్.ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన విలువలు ఆధారంగా క్రమబద్దీకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందట. కాగా, సబ్ రిజిస్ట్రార్ లు సైతం మార్కెట్ గడిచిన వారం రోజులుగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువలకు సంబంధించి పూర్తి నివేదికను తయారు చేసే పనిలో పడ్డారట.
అయితే ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే వెంటనే దీనిని అమలు చేసేందుకు వీలుగా అధికారులు అన్ని ప్రణాళికలను సిద్ధం చేసేశారట. అందులో భాగంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణకు సంబంధించి అన్ని ప్రక్రియలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వానికి వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులలో అనుమతులు లేని లేఅవుట్ లకు సంబంధించిన ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయట. కాగా, ఆయా ప్లాట్ల తనిఖీని సైతం అధికారుల కమిటీ ఇప్పటికే పూర్తి చేసేసిందట.
ఇదిలా ఉంటే మొదటి దశలో గ్రామా, వార్డు సర్వే నెంబర్లు కాలనీల వారీగా క్లస్టర్లుగా విభజించిన అధికారుల బృందం దరఖాస్తులతో పాటు ఆయా ప్లాట్లను సైతం తనిఖీ చేసిందట. మరోవైపు ఎల్ఆర్ఎస్ నిమిత్తం వచ్చిన దరఖాస్తులలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న, క్రమబద్దీకరణకు అర్హత లేని దాదాపు రెండు నుంచి మూడు లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ప్రభుత్వం తిరస్కరించే దరఖాస్తులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు వెలువడతాయా, ఆ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.