(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో బసవపాలెం కొండోడుగుట్టలో పది మంది సభ్యుల బృందం అర్థరాత్రి తవ్వకాలు చేస్తోందని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ మహేశ్ అందించిన వివరాల ప్రకారం.. భోగాపురం మండలంలోని తూడెం పంచాయతీ బసవపాలెం రెవెన్యూలోని కొండోడుగుట్టలో వందేళ్ల కిందట రాజులు నివసించేవారని, ప్రస్తుతం అక్కడ రాతి కట్టడం ఉండటంతో గుప్తనిధి ఏమైనా ఉండొచ్చని స్థానికులు తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన క్షుద్రపూజలు చేసే నిజాముద్దీన్ అనే వ్యక్తికి తెలియజేశారు. ఆయన బి.నర్సింహరాజు(గరివిడి), ఎ.కృష్ణమూర్తి(తూడెం), ఆర్.ఉపేంద్రరావు(మహబూబ్నగర్), మహ్మద్ మైబిల్లి(మహబూబాబాద్), కె.వెంకటరమణ(విశాఖ), ఎండీ అన్వర్(విజయనగరం), అభిశేఖర్, సుఖల్గౌడ్(గాజువాక), వి.మోహన్భార్గవ్కుమార్(కంచరపాలెం)తో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అర్థరాత్రి సమయంలో క్షుద్రపూజలు చేసి తవ్వకాలు ప్రారంభించారు. దీన్ని గమనించిన స్థానికులు వందల సంఖ్యలో వచ్చి వీరిని బంధించారు. ఎవరినైనా హత్యచేసి పాతిపెడుతున్నారా…? అని ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ శ్రీధర్, ఎస్ఐ బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఏమీ దొరక్కపోవడంతో ..
విజయనగరం జిల్లా రెవెన్యూ, భూగర్భ గనులు, పురావస్తు శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో సుమారు 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేశారు. ఏమీ లభించకపోవడంతో అందరూ వెనుదిరిగారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భోగాపురం ఎస్ఐ మహేశ్ చెప్పారు.