( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా హోదాను అనుభవించి , విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన గంటా శ్రీనివాసరావు చాలా రోజుల తర్వాత ఆదివారం పార్టీ కార్యక్రమంలో కనిపించారు. విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి గంటా శ్రీనివాసరావు హాజరు కావడం చర్చనీయాంశమైంది. వార్డు కమిటీల నియామకంపై ఆయన కేడర్తో చర్చించారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Must Read ;- అక్రమ కట్టడాలా.. పతిపక్ష నేతల ఆస్తులా?
ఆది నుంచి అధికార పార్టీపై కన్ను ..
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీనివాసరావు ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతూనే ఉంది. అనేక తేదీలు ఖరారు చేసినా, వాయిదా పడుతూ వస్తోంది. మంత్రి ముత్తంశెట్టి వర్గం విభేదిస్తుండడంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు లక్ష్యంగా ఆక్రమణలు తొలగిస్తున్న ప్రభుత్వం… తాజాగా ఆ జాబితాలో గంటా ఆస్తులను కూడా చేర్చడంతో అధికార పార్టీ ద్వారాలు మూసేసినట్టు అంతా భావించారు.
ఆస్తులు స్వాధీనపరచు కోవడంతోనే..
గంటా శ్రీనివాసరావుకు చెందిన పలు ఆస్తులను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూములు చేజారి పోవడంతో, అధికార పార్టీ పట్ల కొంత వ్యతిరేక భావాన్ని వ్యక్తపరిచినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రేపోమాపో పార్టీలో చేరబోయే వ్యక్తి పట్ల, ఒక మాజీమంత్రి పట్ల ఈ విధంగా వ్యవహరించడం గంటాకు నచ్చలేదని తెలుస్తోంది. మరోవైపు పార్టీ మారేందుకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఆయనకు కలిసి రావడం లేదు. ముందు ముందు గంటా శ్రీనివాసరావు ఎటువంటి ట్విస్ట్లు ఇవ్వబోతున్నారో చూడాలి.
Also Read ;- నోటికి తాళం : పార్టీ మారితే అంత కష్టమా?