అమరావతి రాజధాని ఏ మాత్రం ముంపు ప్రాంతం కాదని మరోసారి రుజువైంది. కృష్ణా నదిలో 8 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినా రాజధానిలోని 29 గ్రామాల్లో ఒక్క చుక్క కూడా నీరు చేరలేదు. దీనికి తోడు కొండవీటి వాగు ముంపును ఎదుర్కొనేందుకు గత ప్రభుత్వం నిర్మించిన ఎత్తిపోతల నేడు ఉపయోగంలోకి వచ్చింది. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకంలో 5 పంపులు నడపడం ద్వారా 750 క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదిలోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో అమరావతి రాజధాని ప్రాంతం చాలా సురక్షిత ప్రాంతమని అర్థమవుతోంది.
వైసీపీ ప్రచారం అబద్దమేనా?
అమరావతి రాజధాని వరద ముంపు ప్రాంతమని వైసీపీ నాయకులు చేసిన ప్రచారంలో నిజం లేదని మరోసారి రుజువైంది. 2019లో కృష్ణా నదికి గరిష్ఠంగా 7 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పట్లో కరకట్ట వెంట ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇళ్లు మునిగిపోతుందని ప్రచారం చేశారు. కానీ ఎంతకూ చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు రాకపోవడంతో వైసీపీ నేతలు మాట మార్చారు. అమరావతి ముంపు ప్రాంతమంటూ చేసిన ప్రచారం అబద్దమని తేలడంతో ఇక ఫలితం లేదని భావించిన వైసీపీ, అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రం అందుకున్నారు.
రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అన్నీ ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని, దీని వల్ల మరోసారి రాష్ట్ర విభజన ఉద్యమం రాకుండా ఉంటుందని వైసీపీ నేతలు సూత్రీకరించారు. ఏదో ఒక విష ప్రచారం చేసి రాజధానిని విశాఖకు తరలించాలన్న యావ తప్ప అమరావతిలో కనీసం లెజిస్లేటివ్ రాజధాని కూడా ఉంచే ఆలోచన వైసీపీ నేతలకు లేదని అర్ధం అవుతోంది.
ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో వరదకు అవకాశం లేదు
ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో వరదకు అవకాశం తక్కువ. 2009 వరదల్లో ఒకేసారి 14 లక్షల క్యూసెక్కులు వచ్చినా అమరావతి రాజధానిలోని గ్రామాలు నీట మునగలేదు. అయితే అమరావతి ప్రాంతంలో ప్రవహిస్తున్న కొండవీటివాగు మాత్రం అప్పుడప్పుడు పొంగుతూ ఉంటుంది. కొండవీటి వాగు వరదను కృష్ణా నదిలో ఎత్తిపోసేందుకు గత ప్రభుత్వం రూ.250 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకం నిర్మించింది. ప్రస్తుతం ఆ పథకం ద్వారా కొండవీటి వాగులో వచ్చిన వరద నీటిని నదిలోకి ఎత్తిపోస్తున్నారు. దీంతో అమరావతి రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో వరద ముంపు తప్పిపోయింది.
కొండవీటివాగు వరదకు కూడా పరిష్కారం లభించడంతో ఇక, అమరావతి రాజధాని ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశమే లేదని అమరావతి జేఏసీ పొలికేక అధ్యక్షుడు కోటయ్య స్పష్టం చేశారు.
ఇప్పుడేమంటారు?
2019లో కృష్ణా వరదలు వచ్చినప్పుడు హడావుడి చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదు. అదిగో చంద్రబాబు ఇళ్లు మునుగుతుంది, ఇదిగో చంద్రబాబు ఇళ్లు మునుగుతుందని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన నాటి నేతలు నేడు కృష్ణా నది వరదపై నోరు మెదపడం లేదు. గత ఏడాది వరదలప్పుడు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుని ఎప్పుడు మునుగుతుందా అని వేచి చూశారు. ఎంతకీ చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు రాకపోవడంతో ఇక చేసేది లేక వెనుతిరిగి వెళ్లిపోయారు.
అమరావతి ప్రాంతంలో కొండవీటివాగు ముంపు తప్ప కృష్ణా నదినీరు ఎప్పుడూ తమ పొలాలను ముంచలేదని ఆ ప్రాంతంలోని 80 సంవత్సరాలు దాటిన వృద్ధ రైతులు సైతం చెబుతున్నారు. అయినా ప్రభుత్వం కేవలం రాజధానిని మార్చాలనే కుట్రతో అమరావతి రాజధాని వరదలొస్తే మునిగిపోతుందని విస్తృతంగా ప్రచారం చేశారు. నేటితో అవన్నీ వట్టిమాటలేని తేలిపోయింది. అజరామరమైనది అమరావతి అని మరోసారి రుజువైంది.