వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, గోడౌన్ నిర్వాహకులు కలిసి విశాఖ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎల్జి పాలిమర్స్ లో స్టెరైల్ మోనోమర్ గ్యాస్ లీక్ కారణంగా మొత్తం 13 మంది మృతి చెందగా, 500 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అప్పటికిగాని ప్రభుత్వం కళ్లు తెరిచి విశాఖ నుంచి ఆ ప్రమాదకర గ్యాస్ను తరలించ లేదు. మరి అంతకంటే ప్రమాదకరమైన అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై నాన్చుడు ధోరణి విశాఖ వాసులను కలవరపెడుతోంది.
లెబనాన్ రాజధాని బీరుట్ లో 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ సృష్టించిన విలయం ప్రపంచం దృష్టిని అమోనియం నైట్రేట్పైకి మళ్ళించింది. ఆ పేలుడు ధాటికి దాదాపుగా కొన్ని వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 100 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం కనిపించింది. అటువంటి అమ్మోనియం నైట్రేట్ విశాఖ నగరానికి యేటా లక్షల టన్నుల కొద్దీ దిగుమతి అవుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది.
అమ్మోనియం నైట్రేట్ నిల్వల కోసం విశాఖలోని ప్రైవేటు గోదాములను ఆశ్రయిస్తున్నారు. వీటిలో ప్రభుత్వ పర్యవేక్షణ అంటూ ఏమీ ఇప్పటివరకు లేదు. కంటైనర్ యార్డ్ లలో వీటిని టన్నుల కొద్దీ నిల్వ ఉంచుతున్నారు. లెబనాన్లో పేలుడు కన్నా అనేక రెట్లు నిల్వలు విశాఖలో ఉంటున్నాయి.
చేతులు కాలాక ఆకులు పట్టుకునే అధికారులు ఇప్పుడిప్పుడే అప్రమత్తం అవుతున్నట్టు చర్యల ద్వారా నిరూపిస్తున్నారు.
పరిసర ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు..
ప్రస్తుతం అమ్మోనియం నైట్రేట్ నిల్వలను శ్రావణ్ షిప్పింగ్ కంపెనీకి చెందిన గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. దీనికి చుట్టుపక్కల అనేక పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా చమురు సంస్థ హెచ్ పి సి ఎల్ ఉంది. పది కిలోమీటర్ల పరిధిలోనే NAD, NSTL, కోరమాండల్, భూగర్భ చమురు నిల్వల సంస్థ, షిప్ యార్డ్ వంటి సంస్థలు ఉన్నాయి.
Noc రద్దు చేసిన పోలీసు శాఖ..
శ్రావణ్ షిప్పింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఎన్ఓసీని పోలీసులు రద్దు చేశారు . దీంతో అమోనియం నైట్రేట్ దిగుమతిపై అయోమయం మొదలైంది. ఇప్పటికే 2 నౌకలు అన్ లోడింగ్ కోసం విశాఖ తీరంలో ఎదురు చూస్తున్నాయి. అలల మధ్య ఈ విధ్వంసకర రసాయన నిల్వలు అన్ లోడ్ కాకుండా ఉండిపోయాయి. మరో నౌక ఈ ఆఖరు వారంలో విశాఖ తీరానికి చేరుకోనుందని సమాచారం.
నౌకల నుంచి అమోనియం నైట్రేట్ ను దిగుమతి చేయడానికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని హ్యాండ్లింగ్ చేసే సంస్థ ఎన్ఓసీని నగర పోలీసు కమిషనరేట్ రద్దు చేసింది. షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువులో సమాధానం ఇచ్చినా , అది సంతృప్తికరంగా లేకపోవడంతో ఎన్ఓసీని రద్దు చేసినట్లు సీపీ తెలిపారు. మరోవైపు.. ఈ రసాయనాన్ని దిగుమతి చేసే ఏకైక పోర్టు విశాఖే కావడంతో ఎరువులు, మైనింగ్ పరిశ్రమలు ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.