అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా నుంచి కోలుకునేందుకు వాడిన యాంటీబాడీ కాక్టెయిల్ మెడిసిన్ ప్రస్తుతం భారత దేశంలోకి అందుబాటులోకి వచ్చింది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రకరకాల మందులు,రోగనిరోధక శక్తి పెంచే ఆహార పానీయాలు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా ఔషధ తయారీ సంస్థ రోచ్ (స్విట్జర్లాండ్ దేశానికి చెందిన కంపెనీ)ఇండియా,సిప్లా సంస్థలు కొత్త యాంటీబాడీ కాక్టెయిల్(కాసిరివిమాబ్, ఇమ్డివిమాబ్)ను భారత విపణిలోకి విడుదల చేశారు.కాక్ టెయిల్ పేరు పెట్టినా ఈ ఔషధాన్ని చర్మం కింద లేదా నరాల ద్వారా ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది.1200మిల్లీ గ్రాములు ఉన్న కాక్ టెయిల్ ప్యాకెట్ ధరను రూ. 59,750గా నిర్ణయించినట్లు రోచ్ ఇండియా,సిప్లా ప్రకటించాయి.మల్టీ డోస్ ప్యాక్ రూ.1,19,500గా నిర్ణయించింది.ఇద్దరికి వినియోగించేందుకు ఉద్దేశించిన1200 మిల్లీలీటర్ల ప్యాకెట్(వయల్)ను ఓపెన్ చేశాక 48 గంటల్లోగా వినియోగించాలని,ఈ కాక్ టెయిల్ను 2నుంచి 8డిగ్రీల ఊష్టోగ్రత మధ్య నిల్వ ఉంచాలని పేర్కొంది. ప్రస్తుతానికి లక్ష ప్యాక్లు అందుబాటులోకి తెచ్చామని వీటిద్వారా 2లక్షల మందికి వినియోగించవచ్చని పేర్కొంది.జూన్ రెండోవారానికి రెండో విడత స్టాక్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.ఒక్కో ప్యాక్ను ఇద్దరు రోగులకు అందించవచ్చని సదరు కంపెనీలు పేర్కొన్నాయి.అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఈ ఔషధం అందుబాటులో ఉంటుందని రోచ్ ఇండియా సీఈవో వి సిమ్సన్ ఇమ్మాన్యుయెల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.కాగా ఈ కాక్ టెయిల్ కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.కాగా ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర వినియోగ నిబంధనల కింద అమెరికా,ఐరోపా దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నట్టు రోచ్ ఇండియా ప్రకటించింది.ఈ విక్రయాల ద్వార కంపెనీ విలువ కూడా రెండింతలు అవుతందని అంచనా వేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Must Read ;- డిసెంబరులోగా 216 కోట్ల వ్యాక్సిన్లు.. ఆచరణలో అనుమానాలెన్నో
తయారీ, వినియోగం ఇదీ..
కాగా ఈ కాక్ టెయిల్ను కొవిడ్ వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా తయారుచేసినట్టు రోచ్ ఇండియా,సిప్లా ప్రకటించాయి.కాసిరివిమాబ్,ఇమ్డివిమాబ్ను కలిపి అభివృద్ధి చేశారు.తక్కువ నుంచి మధ్యంతర స్థాయి వరకు లక్షణాలున్న వారు దీన్ని వినియోగించవచ్చని,12ఏళ్లు పైబడినవారు వాడొచ్చని,ఆక్సిజన్ లెవెల్స్ 90కిపైగా ఉండాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.ఈ కాక్ టెయిల్ వల్ల మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఉత్పత్తి అయి కొవిడ్ను అరికట్టడంలో ఉపయోగపడతాయని,కొవిడ్ స్పైక్ ప్రోటీన్పై పనిచేస్తాయని,నాలుగురోజుల్లో ఫలితం కనిపిస్తుందని ప్రకటించింది.వైరస్లో మ్యుటేషన్లు ఏర్పడినా ప్రభావం చూపిస్తుందని తెలిపింది.గుండె,మూత్రపిండాల వ్యాధులు, మధుమేహం వంటివి ఉన్నవారూ తీసుకోవచ్చని,ఈ యాంటీబాడీ కాక్టెయిల్ తీసుకుంటే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని దాదాపు 70శా తం తగ్గించవచ్చని పేర్కొంది.
అమెరికాలో తయారై..
కాగా కాసిరివిమాబ్,ఇమ్డివిమాబ్లు 600 మిల్లీలీటర్ల మిశ్రమంతో కలిపిన ఈ ఔషధాన్ని తొలుత అమెరికాకు చెందిన రీజనరాన్ కంపెనీ తయారు చేసింది.అక్కడ అత్యవసర వినియోగం కింద గత ఏడాది అనుమతి పొందింది.అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడినప్పడు ఈ ఔషధాన్నే తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఆ కంపెనీ నుంచి ఫార్ములాను తీసుకున్న స్విట్జర్లాండ్కు చెందిన రోచె సంస్థ అంతర్జాతీయ విపణిలోకి విడుదల చేసేందుకు అనుమతి పొందింది.భారత్లో సిప్లా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.యాంటీబాడీలను పెంచేలా కాసిరివిమాబ్, ఇమ్డివిమాబ్ ఫార్ములతో తయారు చేసినందున మోనోక్లోనల్ విశ్రమంగా చెబుతారు.ఈ మిశ్రమం స్పైక్ ప్రొటీన్ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. అయితే ఇది ఎంతమేర ప్రభావం చూపుతుందనేది రానున్న కాలంలో తేలనుంది.
Must Read ;- అమెరికాలోనూ త్వరలో కొవాగ్జిన్.. US FDAకు మాస్టర్ ఫైల్ సమర్పణ