ఏపీ మంత్రివర్గం కాసేపట్లో సమావేశం కానుంది. నివర్ తుఫాను, కరోనా వైరస్, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు, కోర్టు కేసులు, కొత్త జిల్లా ఏర్పాటు, క్రిస్మస్ కు పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం చర్చించనుంది. తిరుపతి ఉపఎన్నికలో గెలుపు వ్యూహాలు, పోలవరం ప్రాజెక్టుపై భారీ వైఎస్ విగ్రహం ఏర్పాటు అంశాలు కూడా క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా మంత్రివర్గం చర్చించనుందని సమాచారం.
నివర్ నష్టం రూ.1000 కోట్లుపైనే..
నివర్ తుఫాను రైతులకు తీవ్రనష్టాల్ని మిగిల్చింది. ముఖ్యంగా వరిసాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్ వరి పంట చేతికి వచ్చే సమయంలో నివర్ తుఫాను భారీ వర్షాలు, పెనుగాలులతో విరుచుకుపడింది. ఏడు జిల్లాల్లో 14 లక్షల ఎకరాల వరిపంట నేలకొరిగింది. కొన్ని ప్రాంతాల్లో కోతకు వచ్చిన వరిపైరు నీట మునిగింది. రైతులకు వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. దీనిపై క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. పంటల బీమాను ప్రభుత్వమే చెల్లిస్తోంది. అయితే ఇంత వరకు ఒక్క రైతుకు పంట నష్టం కింద బీమా చెల్లించిన దాఖలాలు లేవు. దీంతో పంటల బీమాకు ప్రత్యేక సంస్థను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకావం ఉందని తెలుస్తోంది. ఇక నివర్ తుఫానుతో నష్టపోయిన రైతులకు ఎంతసాయం చేయాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది.
Also Read ;- నిమ్మగడ్డతో పెట్టుకుంటే అంతే.. సర్కారుకు సరికొత్త బ్రేక్
స్థానిక ఎన్నికలపై ముందుకు ఎలా?
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషనర్ తో ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీనిపై హైకోర్టులో కేసు విచారణలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవనే విషయాన్ని హైకోర్టుకు ఎలా ప్రజంట్ చేయాలనే దానిపై క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తీర్పులపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.
కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ పెడతారా?
ఏపీలో కరోనా కేసులు తగ్గినా, నేటికీ ప్రతిరోజూ 1300 కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 13 జిల్లాల్లో 15 వేల యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. జనవరి నాటికి కోవిడ్ టీకా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో పంపిణీ ఏర్పాట్లపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. కరోనాపై ప్రధాని సూచనల మేరకు రాత్రపూట నగరాల్లో కర్ఫ్యూ పెట్టే అంశాన్ని కూడా మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. బడులు తెరిసిన నేపథ్యంలో కరోనా వ్యాపించకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అంశంపైనా క్యాబినెట్ చర్చించనుంది.
ఇతర అంశాలు
ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. దీనిపై మంత్రుల అభిప్రాయలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటులో వస్తున్న సమస్యలపై కూడా క్యాబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్న ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై మంత్రివర్గం చర్చించనుంది. పోలవరం ప్రాజెక్టుపై 100 అడుగుల వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసే అంశం కూడా క్యాబినెట్ చర్చించనుంది.
Must Read ;- ఏమైపోతామో.. ఉపాధ్యాయుల్లో కొత్త జిల్లాల కలవరం