బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. గోదావరి జలాల వినియోగం, ఏపీకి అత్యంత కీలకమైన ప్రాజెక్ట్గా భావిస్తోన్న బనకచర్లపై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.. కడప గడపలో కన్నుల పండుగగా జరుగుతోన్న తెలుగు తమ్ముళ్ల పండుగ మహానాడు వేదిక సాక్షిగా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.. బనకచర్ల ప్రాజెక్ట్ వలన తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని వివరించారు. ఏపీకి ఈ ప్రాజెక్ట్ ఎంత కీలకమో ఆయన విశదీకరించారు..
ఏపీ మొత్తాన్ని సస్యశ్యామంల చేయగల సత్తా ఉన్న ప్రాజెక్ట్ బనకచర్ల. ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్న నదీ జలాలపై ఎలాంటి వివాదం లేదని సూచించారు ఏపీ ముఖ్యమంత్రి.. బనకచర్ల వల్ల ఎలాంటి నష్టం లేదని, నదీజలాలకు సంబంధించి ఏపీ చివరన ఉందని సముద్రంలో కలిసే నీటిని ఉపయోగించుకుంటే లాభమే తప్ప నష్టం లేదని వ్యాఖ్యానించారు.. తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అడ్డుకోలేదని, తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళలాంటివని మహానాడు వేదికగా మరోసారి స్పష్టం చేసారు చంద్రబాబు. బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం ఆపాలని, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులని అడ్డుకోవడం సహేతుకం కాదని సూచించారు ఏపీ ముఖ్యమంత్రి..
బనకచర్ల పోలవరం ప్రాజెక్ట్, అధికారికంగా గోదావరి-బనకచర్ల ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు సాగు, తాగునీటి సరఫరా కోసం గోదావరి నది నుండి నీటిని కృష్ణా, పెన్నా నదులకు మళ్లించే ఒక భారీ సాగునీటి పథకం. గోదావరి నది నుండి పోలవరం ప్రాజెక్ట్ వద్ద నీటిని బనకచర్ల (కర్నూలు జిల్లా) వరకు మళ్లించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరవు ప్రాంతాలకు సాగు, తాగునీటి సరఫరాని అందించడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు.. సుమారు 8 మిలియన్ ప్రజలకు తాగునీరు, 7.5 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం, ఇప్పటికే ఉన్న 22 లక్షల ఎకరాల సాగును స్థిరీకరణ సాధ్యం అవుతుందని అంచనా వేస్తున్నారు..
ఏపీలోని కరువు జిల్లాలుగా భావించే రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాకి బనకచర్ల ప్రాజెక్ట్కి భారీ లాభాలు కలగనున్నాయి.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని కరవు ప్రాంతాలకు నీటి సరఫరా, వ్యవసాయ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఒక గేమ్-ఛేంజర్గా పరిగణించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలైతే, రాయలసీమ, ఇతర తీర ప్రాంత జిల్లాలు సమృద్ధిగా మారే అవకాశం ఉంది. చంద్రబాబుని బూచిగా చూపించి రాజకీయ లబ్ది పొందాలని బీఆర్ఎస్ యోచిస్తోంది.. తెలంగాణలో పడిపోయిన తమ గ్రాఫ్ని పెంచుకోవాలంటే టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేసుకోవాలని గులాబీ దండు యోచన.. వారి ఆశలపై నీళ్లు చల్లారు చంద్రబాబు.. బనకచర్లకి చుక్క నీటిని కూడా అదనంగా వినియోగించుకోమని, నదీ జలాల పరీవాహక ప్రాంతంగా చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి ఉండే హక్కులని మాత్రమే తాము సాధించుకుంటామని తెలియజెప్పారు.. తెలంగాణకి అన్యాయం చేయమని హామీ ఇచ్చారు.. మరి, దీనిపై గులాబీ నేతలు ఇప్పటికి అయినా సైలెంట్ అవుతారా?? లేదా?? అనేది చూడాలి..











