ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మారిపోయారా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన గతానికి భిన్నంగా వ్యవహరించారు. మొహమాటాలకు పోకుండా…ముక్కుసూటిగా చెప్పాలనుకున్నది చెప్పారు. అధికారులు చేసిన కొన్ని అసంబద్ధ ప్రతిపాదనలకు వెంటనే నో చెప్పారు. అందుకు గల కారణాలనూ ఆయన వివరించారు. ఫలితాలు ముఖ్యమని, మాటలు వద్దని హోం మంత్రి అనితకు సైతం స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. విజ్ఞాన ప్రదర్శన చేయొద్దని కొందరు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పని చేయకుండా, కేవలం మెచ్చుకోలు మాటలతో ఇకపై మభ్యపెట్టలేరని సిగ్నల్స్ పంపారు.
నిజానికి సీఎం చంద్రబాబు అంటే బ్యూరోక్రాట్స్ ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఆయన వారెవరినీ చిన్న మాట కూడా అనరు. ఎన్ని తప్పులు చేసినా గట్టిగా మందలించరు. దీంతో ఆయనను ఆకట్టుకుంటే చాలు..మరెవరికీ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భావిస్తుంటారు. బాబు దృష్టిలో పడి మార్కులు కొట్టేయాలని తెగ ఆరాటపడుతుంటారు. కొందరు సీనియర్ అధికారులైతే..బాబుకు మేమెంత చెబితే అంత, మా మాటను కాదనరు అన్న ఫీలింగ్లో ఉంటారు. అయితే మంగళ, బుధవారాల్లో జరిగిన కలెక్టర్ల సదస్సులో అదంతా గతమని తేల్చేసింది.
రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో చంద్రబాబులో కొత్త వ్యక్తి కనిపించారు. పనితనం చూపని అధికారులపై మండిపడ్డారు.
తన సహజత్వానికి భిన్నంగా..సుదీర్ఘ ప్రసంగాలు లేకుండా సూటిగా వ్యవహరించారు. అధికారులతో పాటు మంత్రులకూ షాకులిచ్చారు. ఈయన మన చంద్రబాబేనా..? ఇలా మందలిస్తున్నారేంటి..? ఇన్ని ప్రశ్నలు వేసి నిలదీస్తున్నారేంటి.. ఇంత కటువుగా మాట్లాడుతున్నారేంటని అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్లు, నవ్యాంధ్రలో ఐదేళ్లు సీఎంగా పని చేసినప్పుడు, ఏనాడజూ ఒక్క అధికారిని ఇబ్బందిపెట్టేలా మాట్లాడలేదు చంద్రబాబు. ఎప్పుడైనా మందలించాల్సి వస్తే మనసు నొప్పించకుండా మాట్లాడేవారు.
ఇక మంత్రులు, ప్రజాప్రతినిధుల విషయంలోనూ చంద్రబాబు మెతకగానే ఉండేవారు. ఐతే ఇప్పుడు ఆయన గేర్ మార్చారు. కలెక్టర్ల సదస్సులో సీనియర్ అధికారులు, కలెక్టర్లు ఏం చెబుతున్నారో..ఎలాంటి ప్రతిపాదనలు తన ముందు పెట్టి చర్చించదలిచారో..శాఖలు, జిల్లాల ప్రజెంటేషన్లలో పేర్కొన్న అంశాలపై ముందుగానే లోతైన అధ్యయనం చేశారు. గతంలో సీనియర్ అధికారులు ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చినా వెంటనే నమ్మి..దానినే ఆచరించాలని మిగతా వారికి చెప్పేవారు. దీనివల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. తామేది చెప్పినా చంద్రబాబు వింటారని.. ఏమాత్రం ఆలోచించకుండా ఆచరణలోకి తీసుకొస్తారన్న ధీమా వారిలో కలిగేలా చంద్రబాబు వ్యవహారశైలి ఉండేది.
కానీ ఇప్పుడు ఆ వైఖరికి బాబు స్వస్తి పలికారని అధికారులే స్వయంగా చెబుతున్నారు. జిల్లాల్లో అమలు చేయకుండా ఊరకే సోది చెబితే అంగీకరించేది లేదని కలెక్టర్లకు తేల్చి చెప్పారు చంద్రబాబు. ఏం చేశారో అది మాత్రమే ప్రజంటేషన్ చేయాలని కటువుగా చెప్పశఆరు. నాకు థియరీ క్లాసులు ఇస్తున్నారా అంటూ ఘాటుగా స్పందించారు.
అయినప్పటికీ….కొందరు అధికారులు చంద్రబాబు మాటల్లోని తీవ్రతను, ఆలోచనను అర్థం చేసుకోకుండా..వెంట తెచ్చుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను బట్టి పట్టినట్లు చదవడంతో చంద్రబాబు స్వరం పెంచారు. ఇప్పటిదాకా జిల్లాల్లో ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పాలి కానీ, కథలు, కహానీలు చెప్పొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. విజ్ఞాన ప్రదర్శనలు వద్దంటూ గట్టిగానే హెచ్చరించారు. అధికారులు ప్రజల నుంచి నేర్చుకుంటేనే నిజమైన ఫలితాలు సాధించగలరని చెప్పారు. ఇందుకోసం ఏప్రిల్ నుంచి అధికారులు గ్రామాలకు తరలివెళ్లాలని, ఒకరోజు అక్కడే మకాం వేసి అధ్యయనం చేయాలని ఆదేశించారు. మంత్రులను కూడా ఆయన వదల్లేదు.
శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై చర్చ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. శ్రీకాకుళం అభివృద్ధి, సమస్యల గురించి మంత్రి ప్రస్తావించారు. కొన్ని సమస్యలను ఏకరువుపెట్టారు. అంతే..సీఎం సీరియ్సగా స్పందించారు. జిల్లా స్థాయిలో చర్చించి అక్కడే నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సిన అంశాలను ఇంతకాలం ఎందుకు చర్చచేయలేదు. ఇక్కడిదాకా ఎందుకు తీసుకొచ్చారని ఆయన్ను ప్రశ్నించారు