ఏపీ కూటమి సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది. ఈ నెలలోనే అన్నదాతసుఖీభవ స్కీమ్ను ప్రారంభించనుంది. తాజాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరాలు వెల్లడించారు.
జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనుంది. దీంతో ఇప్పటివరకూ జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ఓర్చుకోలేని వైసీపీ నేతలు చౌకబాు విమర్శలు చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టలని పిలుపునిచ్చారు.
ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా ప్రతి రైతు ఖాతాలో 20 వేల రూపాయలు జమ చేయనున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి కూడా సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే 15 వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తిగా 2027 డెడ్లైన్ పెట్టుకున్నామన్నారు చంద్రబాబు. పోలవరానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టామన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు అందజేస్తున్నామని, దీపం 2 కింద కోటి మందికి పైగా లబ్ధిదారులకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా DSC నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తు చేశారు. వీటన్నింటినీ ప్రజలలోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు.