నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్న సమయంలో…రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాయలసీమ యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీకి అనుమతి మంజూరు చేసింది. రూ.1622 కోట్ల పెట్టుబడితో కూల్డ్రింక్స్, జ్యూస్లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం కల్పించగా..తాజాగా భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1200 మందికి..పరోక్షంగా మరో 3 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన SIPB సమావేశంలో ఆమోదం కల్పించిన ఈ ప్రాజెక్టుకు ఏపీ సర్కార్ 80 ఎకరాల భూమిని కేటాయించారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,200 మందికి ఉపాధి లభిస్తుందని రిలయన్స్ తన DPRలో స్పష్టం చేసింది. ప్లాంట్ కోసం ఎకరాకు రూ.30 లక్షల చొప్పున 80 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్లాంట్లో బాట్లింగ్ లైన్, వేర్హౌసింగ్, వాటర్ ట్రీట్మెంట్ సౌకర్యాలు, అడ్మినిస్ట్రేటివ్ భవనాలు ఉంటాయని రిలయన్స్ సంస్థ పేర్కొంది.
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ఈ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహకాలు సైతం అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబర్లోగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ఉత్తర్వుల్లో రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. రిలయన్స్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రూ. 65 వేల కోట్ల పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయోగాస్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తాజా పెట్టుబడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చనుంది.











