ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి సర్కారు అప్పుల మీద అప్పులు చేస్తోంది. ప్రతి చిన్న విషయానికీ ప్రభుత్వం అప్పులనే ఆశ్రయిస్తున్న తీరు నిజంగానే వివాదాస్పదంగా మారుతోందనే చెప్పాలి. ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం.. ఆయా అప్పులను అధిక వడ్డీలకు తీసుకుంటూ ఉండటం మరింత ఆందోళన రేకెత్తుతోంది. మొత్తంగా వడ్డీ ఎంతైనా ఫరవా లేదు.. అప్పు కావాల్సిందేనన్న రీతిలో సాగుతున్న ఏపీ ప్రభుత్వ తీరుపై ఇటు విపక్షాలతో పాటు అటు ఆర్థిక నిపుణులు, మేథావులు, సాధారణ జనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.
7 శాతం కంటే అధిక వడ్డీలకు..
పది రోజుల క్రితం రూ.4 వేల కోట్లను అప్పుగా తీసుకున్న ప్రభుత్వం.. దానికి 7 శాతానికి పైగా వడ్డీ చెల్లించేవందుకు ఒప్పుకుంది. ప్రభుత్వం తీసుకునే అప్పులకు ఈ మేర వడ్డీ అంటే చాలా ఎక్కువేనని చెప్పాలి. ఈ అప్పు ఎందుకు తీసుకున్నారో చెప్పని ప్రభుత్వం.. తాజాగా రిజర్వ్ బ్యాంకు నుంచి రూ.1,750 కోట్ల మేర రుణాన్ని తీసుకుంది. ఇందులో రూ.1,000 కోట్లను 7.12 శాతం వడ్డీకి తీసుకోగా.. మిగిలిన రూ.750 కోట్లను మరింత ఎక్కువగా7.14 వడ్డీకి తీసుకుంది. ఈ కొత్త అప్పును ప్రభుత్వ సెక్యూరిటీ డిపాజిట్లను విక్రయించడం ద్వారా జగన్ ప్రభుత్వం సేకరించింది.
ఉద్యోగుల వేతనాలకూ అప్పులేనా?
జూన్ వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు చాలా ఆలస్యంగా చెల్లించింది. పదో తారీఖు వస్తున్నా.. చాలా మంది ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగానే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదన్న వాదనలు వినిపించాయి. అయితే మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం హడావిడిగా సర్కారీ సెక్యూరిటీ డిపాజిట్లను వేలం వేయడం ద్వారా రిజర్వ్ బ్యాంకు నుంచి రూ.1,750 కోట్లను సేకరించింది. ఈ నిధులను ఉద్యోగుల వేతనాల చెల్లింపు కోసమే వినియోగిస్తున్నట్లుగా సమాచారం. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం కూడా అప్పులు చేస్తున్న జగన్ సర్కారు.. ప్రతి చిన్న విషయానికి కూడా అప్పులు చేయడం, వాటికి అధిక వడ్డీలు చెల్లించేందుకు కూడా సిద్ధపడిన వైనం చూస్తుంటే.. త్వరలోనే ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ‘పరిమితి’కి మించి ఇదేం ‘వాడకం’ స్వామీ?