గురుశిష్యుల అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. దర్శకుడు వి.ఎన్. ఆదిత్య దర్శకత్వ శాఖలో ఓనమాలు దిద్దింది ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గర. ఎన్ని పనులు ఉన్నా తరచూ తన గురువును ఫోన్ లో పలకరించడం వి. ఎన్. ఆదిత్యకు అలవాటు. సింగీతం కూడా హైదరాబాద్ వస్తే ఆదిత్యను కలవకుండా ఉండరు. తన గురువు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారని తెలిసి ఆదిత్య ఫోన్ లో పలకరించబోతే ఆదిత్యకు ఆయన ఎంతో ధైర్యం చెప్పారట. 90 ఏళ్లు వచ్చినా ఆయన మనోధైర్యాన్ని మనం మెచ్చుకుని తీరాల్సిందే. ఈ సెప్టెంబరు 21 వ తేదీ ఆయన పుట్టిన రోజు కూడా.
ఈ సమయంలో ఆయన కరోనా బారిన పడటం చూసి ఆయన త్వరగా కోలుకోవాలని ఆదిత్య ఆకాంక్షించారు. ఇటీవలే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తనను కలిసినప్పుడు ఏర్పడిన అనుభూతిని ఆదిత్య మరోసారి గుర్తుచేసుకున్నారు. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ జంటగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. యువతరం ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మొయినాబాద్ లక్ష్మీక్షేత్రంలో హీరోయిన్ , తదితరులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయమది.
విశేషమేమిటంటే ఆ సినిమా షూటింగు జరుగుతుండగా సింగీతం శ్రీనివాసరావు సతీసమేతంగా హైదరాబాద్ కు వచ్చారు. ఆదిత్యకు ఫోన్ చేస్తే తను ఫలానా చోట షూటింగ్ లో ఉన్నట్లు చెప్పడంతో సింగీతం ఆగలేదు. లొకేషన్ పంపించమని చెప్పి సతీసమేతంగా ఆ సెట్ లోకి వెళ్లారు. అంతేకాదు ఆ సినిమాలోని ఓ సన్నివేశానికి కూడా దర్శకత్వం వహించారు. దీనికి వి.ఎన్. ఆదిత్య క్లాప్ కొట్టడం మరో విశేషం.‘బృందావనం’,‘భైరవద్వీపం’,‘శ్రీకృష్ణార్జున విజయం’ చిత్రాలకు వి.ఎన్.ఆదిత్య ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అప్పుడు దగ్గర ఎలా క్లాప్ కొట్టారో.. ఇప్పుడు మళ్లీ అలాగే కొట్టడంతో సెట్ లో ఉన్న అంతా ‘క్లాప్స్’కొట్టేశారు.
పైగా సింగీతం శ్రీనివాసరావులాంటి దర్శకుడి దర్శకత్వంలో నటించినందుకు నేటి తరం నటులు కూడా ఎంతో సంబరపడ్డారు. హీరోయిన్, ఆమె తల్లిదండ్రుల మీద ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భాన్ని వి.ఎన్.ఆదిత్య గుర్తుచేసుకుంటూ తన గురువు ఇప్పటికీ యువకుడిలానే చాలా చురుకుగా ఉంటారన్నారు. ‘వాహిని సంస్థలో నేను కొట్టిన క్లాప్ అనుభూతి మళ్లీ నాకు పునరావృతమైంది. సింగీతం గారు మొట్టమొదటిసారి నా సెట్ కు వచ్చారు. అప్పట్లో నాలుగేళ్లు ఆయన దగ్గరే ఉండి వాళ్లింట్లో భోజనంచేసి పెరిగిన కుర్రాడిని నేను.
‘పీపుల్స్ మీడియా’ అధినేత విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిభొట్ల కూడా అతిథులుగా మా షూటింగ్ కు వచ్చి మా ఆనందాన్ని వారు కూడా పంచుకున్నారు. నిర్మాత అర్జున్ దాస్యన్ పట్టుబట్టలు పెట్టి సింగీతం దంపతులను సత్కరించారు. హాఫ్ డే ఆయన మాతోనే గడిపారు’ అని ఆదిత్య వివరించారు. గురువు సింగీతం శ్రీనివాసరావు గారు త్వరగా కోలుకోవాలని, ఈ నెల 21వ తేదీ పుట్టిన రోజు సందర్భంగా ముందే శుభాకాంక్షలు చెబుతున్నానని ఆదిత్య తెలిపారు.