సాధారణంగా అమ్మాయిలు అనగానే సమాజంలో కొన్ని మూస అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. ఇలాగే ఉండాలి, ఇలాంటి ఆటలే ఆడాలి, ఈ పనులు మాత్రమే చేయాలి అంటూ నియమాలు పెడుతుంటారు. కానీ, కొందరు అందరి అభిప్రాయాలను తలకిందులు చేస్తూ తమ ప్రతిభతో దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తారు. అటువంటి అమ్మాయి మన విజయవాడ జ్యోతి కూడా. విల్లు పట్టడం అంటేనే అబ్బాయిల పని అనుకుంటారు. కానీ, పాతికేళ్లు కూడా నిండని ఈ విజయవాడ అమ్మాయి తన విలువిద్యతో బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది.
క్రీడా కుటుంబ నేపథ్యం
జ్యోతి జులై 3, 1996లో విజయవాడలో జన్మించింది. తండ్రి కబడ్డీ ప్లేయర్ కావడంతో తన కుటుంబంలోని క్రీడా నేపథ్యం తనపై ప్రభావం చూపింది. 4 ఏళ్ల వయసులో క్రిష్ణా నదిలో ఐదు కిలోమీటర్లు దూరాన్ని 3 సార్లు దాటిన చిన్నారిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకుంది. జ్యోతి ఈ ఘనతను 3 గంటల 20 నిమిషాల 6 సెకన్లలో సాధించింది. 13 ఏళ్ల వయసుకే ఒలంపిక్ లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
అవార్డుల పంట
నాలుగేళ్ల వయసుకే సంచలనాలని మొదలుపెట్టిన ఈ చిన్నారి, తర్వాతి కాలంలో 2011 లో ఏషియన్ ఛాంపియన్ ఆర్చరీలో రెండు కాంస్య పతాకాలను గెలుచుకుంది. అంతేనా, 2015 ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్ గా నిలచింది. 2019 లో ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ లో రెండు కాంస్య పతకాలను గెలిచి అందరి దృష్టని తనవైపు తిప్పుకుంది. 2020లో తిరిగి ఆసియా ‘ఆర్చరీ’ ఛాంపియన్ షిప్ లో మిక్సడ్ డబుల్స్ లో బంగారు పతకాన్ని గెలిచింది. అంతేనా, తన గ్రూప్ మెంబర్స్ ప్రియ గుర్జర్, ముస్కన్ కిరార్ తో కలసి రజత పతకాన్ని అందుకుంది. ఇలా ఒక్కటేమిటి, జాతీయం, అంతర్జాతంగా కలిపి దాదాపు 70కి పైగా అంతర్జాతీయ పతకాల్ని గెలుచుకుంది.
అర్జున అవార్డు గ్రహీత
ఆర్చరీ విభాగంలో తన విజయాలకు మెచ్చుకుని కేంద్ర ప్రభుత్వం 2017 లో అర్జున అవార్డుతో సత్కరించింది. రాష్ర్టానికి గుర్తింపు తెచ్చినందుకు తనని మెచ్చుకుంటూ అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోటి రూపాయల అవార్డును అందించడంతో పాటు, ఇంటి స్థలాన్ని కూడా బహూకరించారు.
జాతీయం, అంతర్జాతీయం అనే తేడా లేకుండా పతకాలను అలవోకగా ‘గురి’ చూసి గెలుచుకుంటున్న ‘జ్యోతి’ మరెన్నో పతకాలు గెలిచి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయాలని కోరుకుందాం.