ఓటీటీలో సినిమాల విడుదలను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఓ పక్క ఈ కరోనా గండం నుంచి ఏదో ఒక విధంగా గట్టెక్కాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మరో పక్క ఎగ్జిబిటర్ల గతేంటని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఓటీటీలో సినిమాలను విడుదల చేయాలని హీరోలు నిర్ణయం తీసుకున్నపుడు సమర్థించేవారు కరవైపోయారు. నాని తన వి సినిమా గురించి ప్రకటించినప్పుడు కూడా ఎవరూ నోరు మెదపలేదు. అలాగే హీరో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని ప్రకటించారు.
సీనియర్ నిర్మాత సి. అశ్వినీదత్ తన మద్దతును ప్రకటించారు. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్. గోపీనాథ్ బయోపిక్గా సూర్య నటిస్తూ నిర్మించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. తమిళంలో ఇది ‘సూరారై పొట్రు’ గా తెరకెక్కింది. ఈ సినిమాని అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేయనున్నారు. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే అవకాశాలు లేకపోవడం వల్లే సహ నిర్మాత గునీత్ మోంగాతో కలిసి సూర్య ఈ నిర్ణయం తీసుకున్నారు.
సూర్యతో ‘సింగం’ మూవీ సిరీస్ను రూపొందించిన సీనియర్ డైరెక్టర్ హరి ఆ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని తాజాగా సూర్యకు లేఖ రాయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. “సూర్య నటించిన చిత్రాలను తెరపై చూస్తేనే బాగుంటుందనేది ఓ అభిమానిగా తన కోరిక అన్నారు. అందువల్ల ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని ఓటీటీలో నేరుగా విడుదల చేయాలన్న నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలి” అని హరి ఆ లేఖలో పేర్కొన్నారు.
సూర్య తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ సమర్ధించారు. ఆరు నెలలుగా మహమ్మారి వ్యాప్తి కారణంగా జన జీవనం స్తంభించిపోయి ఉందనీ, అందుకు అనుగుణంగా థియేటర్లను కూడా మూసివేశారనీ, ఇప్పుడు అవి తెరుచుకున్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి కరోనాకు బలి చేయడం సరైన పని కాదనీ ఆయన అభిప్రాయపడ్డారు.
‘వి’ చిత్రం తనకు మైలురాయి లాంటి 25వ చిత్రమైనప్పటికీ, నేటి వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఓటీటీలో విడుదల చేయడానికి నాని అంగీకరించడం ఎంతైనా అభినందనీయమని కూడా అశ్వనీదత్ అన్నారు. డైరెక్టర్ హరి సినిమాలకు తను అభిమాని అని, ప్రేక్షకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సూర్య తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలపాల్సిందిగా ఆయనను కోరుతున్నానన్నారు. ఈ ఓటీటీ విడుదలపై ఇంకా ఎవరెవరు ఏమంటారో చూడాలి.