Basha Along With His Wife And Children Committed Suicide Attempt :
నిజమే.. స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకున్నా ఆ వైసీపీ రాబందు వినలేదు. బడుగు జీవుల పొలాన్ని ఆక్రమించి తిరిగి ఇచ్చేందుకు సమ్మతించలేదు. అంతటితో కూడా ఆగలేదు. తనపైనే సీఎం జగన్కు ఫిర్యాదు చేస్తారా? అంటూ తనదైన శైలిలో బాధిత కుటుంబాన్ని వేధించడం మొదలెట్టాడు. వెరసి ఇక తమకు రక్షణ లేదన్న భావనకు వచ్చేసిన బాధిత కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. మొత్తం నలుగురు సభ్యులున్న ఈ కుటుంబంలో భార్యాభర్తలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డా.. ఇద్దరు కూతుర్లు మాత్రం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో చోటుచేసుకున్న ఈ ఘటన వైసీపీ సర్కారును మరింత డేంజర్ లో పడేసిందనే చెప్పాలి.
అసలు కథ ఏంటంటే..?
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని దువ్వూరు మండలం ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషాకు దాన విక్రయం ద్వారా సంక్రమించిన 1.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో సాగుతోనే బాషా తన కటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఇటీవల ఈ భూమిపై దువ్వూరు మండల వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి కన్ను పడిందట. ఈ భూమిని తనకు అప్పగించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారట. తిరుపాల్ రెడ్డి బెదిరింపులతో బెంబేలెత్తిపోయిన బాషా నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ సూచనతో మైదుకూరు సీఐ కొండారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తొలుత ఫిర్యాదు తీసుకున్న కొండారెడ్డి దానిపై ఎలాంటి కేసు కట్టకుండానే.. న్యాయం చేస్తానంటూ నమ్మబలికారట. అయితే శుక్రవారం నాడు ఏమైందో తెలియదు గానీ.. సీఐ కొండారెడ్డి వైసీపీ నేత తిరుపాల్ రెడ్డికి అనుకూలంగా మారిపోయారట. ఈ క్రమంలో తాను చెప్పినట్టుగా వినకపోతే ఎన్ కౌంటర్ చేస్తానని బాషాను కొండారెడ్డి బెదిరించారట. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో తనదైన మార్కు దౌర్జన్యాన్ని ప్రదర్శించిన కొండారెడ్డి.. బాషాను బూటు కాలితో తన్నడంతో పాటుగా బాషా భార్యను పోలీస్ స్టేషన్ అవతలకు ఈడ్చి పారేశారట. ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ సెల్ఫీ వీడియోలో రికార్డు చేసిన బాషా.. తనకు న్యాయం జరగకుంటే ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని తెలిపారు. ఈ వీడియో వైరల్ కాగా.. సీఎం జగన్ దృష్టికీ వెళ్లింది. సీఎంఓ నేరుగా జోక్యం చేసుకోవడంతో రంగంలోకి దిగిన కడప జిల్లా ఎస్పీ.. సంబంధిత సీఐని విధుల నుంచి తప్పించి బాషా కుటుంబానికి న్యాయం చేస్తామంటూ భరోసా ఇచ్చారు.
సామూహిక ఆత్మహత్యాయత్నం
ఇంత జరిగినా.. తిరుపాల్ రెడ్డి తను ఆక్రమించిన భూమిని బాషా కుటుంబానికి అప్పజెప్పలేదట. అంతేకాకుండా ఆ భూమిని బాషాకు ఇచ్చేది లేదని తేల్చి.పారేశారట. సీఎం కాదు కదా ఎవరు చెప్పినా ఆ భూమిని వదిలేది లేదని, ఇంత జరిగాక కూడా తాను దిగివస్తే.. తన ఇమేజీ ఏం కావాలంటూ తిరుపాల్ రెడ్డి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారట. ఇదే విషయం బాషాకు చేరేలా తిరుపాల్ రెడ్డి ప్లాన్ రచించారట. విషయం తెలుసుకున్న బాషా.. ఇక ఎర్రబల్లిలో తనకు గానీ, తన కుటుంబానికి గానీ భద్రత లేదని తెలుసుకుని భార్యాబిడ్డలతో కలిసి పొరుగునే ఉన్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని చాగలమర్రిలోని తన బంధువుల ఇంటికి చేరారు. ఈ క్రమంలో తిరుపాల్ రెడ్డి తనను వేధింపులకు గురి చేసిన వైనాన్ని గుర్తు చేసుకుని తీవ్ర మనస్తాపానికి గురైన బాషా.. సోమవారం రాత్రి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయాన్ని గమనించిన స్థానికులు వారిని స్థానికంగా ఉన్న కేరళ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెనువెంటనే రంగంలోకి దిగి.. బాషా కుటుంబాన్ని ప్రొద్దటూరు తరలించారు. అయితే బాషా, ఆయన సతీమణి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా.. వారి ఇద్దరు కుమార్తెల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందట.
Must Read ;- వైసీపీలో ‘తూర్పు’ ముసలం