ఉత్తరాంధ్రకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న విశాఖ నగరం ఏవియేషన్ రంగానికి కేంద్ర స్థానంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. బ్రెజిల్కి చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయర్.. ఇండియాలో విమానాల అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఆదానీ గ్రూప్తో కలిసి ఎంబ్రాయర్ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.
గుజరాత్ రాష్ట్రంలోని థోలేరా.. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం ప్రాంతాలను ఎంబ్రాయర్ ప్రతినిధులు పరిశీలించారు. అంటే విమానాల తయారీ పరిశ్రమ కోసం మన రాష్ట్రం.. గుజరాత్తో పోటీ పడుతోందన్న మాట. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రయాణ అవసరాల కోసమే కాకుండా.. ఇక్కడ భారీ ఏవియేషన్ హబ్ను డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే ఏవియేషన్ ఎడ్యూ సిటీ పనులు ప్రారంభమయ్యాయి. ఇండిగో విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాలింగ్ కేంద్రం కూడా వస్తోంది. ఇప్పుడు ఎంబ్రాయర్ కూడా వస్తే.. భారతదేశంలో విమానాలు తయారు చేసే మొదటి రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టిస్తుంది.
ఆదానీ గ్రూపు దేశంలో అనేక ఎయిర్పోర్టులను నిర్వహిస్తోంది. ఈ మధ్యే విమానాల నిర్వహణ రంగంలోకి అడుగు పెట్టింది. ఎంబ్రాయర్ సంస్థ 70 నుంచి 140 సీట్ల సామర్ధ్యం కలిగిన చిన్న, మధ్య తరహా విమానాలను తయారు చేస్తుంది. ఈ కంపెనీ వస్తే అనుబంధంగా.. విడి భాగాల తయారీ సంస్థలూ వస్తాయి. దీంతో ఉత్తరాంధ్రలో భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గుజరాత్ నుంచి పోటీయే ఎంబ్రాయర్ ఏపీ ఎంట్రీకి పెద్ద అవరోధం. అయితే ఢిల్లీ పెద్దలను కన్విన్స్ చేసి.. విమానాల తయారీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు.. మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భోగాపురం కొత్త విమానాశ్రయం కావడంతో.. విమానాల అసెంబ్లింగ్.. టెస్టింగ్ చేయడానికి అనుగుణంగా ఇక్కడ మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ పాయింట్తోనే ఎంబ్రాయర్ కంపెనీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే భోగాపురం ప్రపంచ మ్యాప్లో ప్రత్యేక స్థానం సంపాదించుకొంటుంది.











