ముంబయికి చెందిన నటి కాదంబరి జత్వానీని ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారులు, వైసీపీ నేతలు, పోలీసులు వేధించిన కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను వేధించిన వ్యవహారంలో ఐపీఎస్ అధికారులే కాకుండా.. పోలీసు అధికారులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. కానీ, ఆమె పట్ల ఒక మహిళా ఎస్ఐ కూడా క్రూరంగా వ్యవహరించిన విషయం బయటకొచ్చింది. పై అధికారులు ఆదేశించడం వల్ల చట్ట విరుద్దమైనా కూడా రెచ్చిపోయిన ఓ మహిళా ఎస్ఐ.. జత్వానీని భౌతికంగా హింసించినట్లుగా తెలుస్తోంది. ఆమె ఏకంగా బాధితురాలి పొట్టలో కాలుతో బలంగా తన్నినట్లుగా తెలుస్తోంది.
అయితే, జత్వానీని ఇబ్బందులు పెట్టడమే కాదు.. ఈ మహిళా ఎస్ఐపై గతంలోనూ వివాదాస్పద ఆరోపణలు ఉన్నట్లుగా విచారణ అధికారులు గుర్తించారు. ఆమె మహిళలపై దాడులు చేశారంటూ మరో వ్యక్తిపై గతంలో తప్పుడు కేసులు పెట్టినట్లుగా ఈమెపై ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎస్ఐపై బాధితులు భారత రాష్ట్రపతికి కూడా లేఖ రాసిన ఉదంతాలు ఉన్నాయంటే.. ఆమె ఎంత కంత్రీ ఎస్ఐ అయి ఉంటారో అని ఈ విషయం తెలిసిన పలువురు చర్చించుకుంటున్నారు. అప్పట్లో ఆ ఎస్ఐ పై దర్యాప్తునకు రాష్ట్రపతి ఆదేశించినా కూడా.. అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా ఆ ఆదేశాలను పట్టించుకోలేదని తెలిసింది. నటి జత్వానీని కూడా ఈ మహిళ ఎస్ఐ తీవ్రంగా కొట్టినట్లుగా పోలీసు విచారణలో తేలింది.
కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడిన సంగతి తెలిసిందే. ముంబయి నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా, విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్నీని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. జత్వానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విజయవాడ పోలీసులు ఇచ్చిన నివేదికను డీజీపీ ద్వారకా తిరుమల రావు ప్రభుత్వానికి కూడా అందించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ జీవో 1590, 1591, 1592 జారీ చేసింది.
ప్రముఖ వ్యాపారవేత్త వైఎస్ జగన్ స్నేహితుడు అయిన సజ్జన్ జిందాల్పై కాదంబరి జత్వానీ పెట్టిన కేసు నుంచి కాపాడేందుకు ఆమెను అక్రమ కేసులో ఇరికించి నరకం చూపించారు. అందుకు వైసీపీ అధిష్ఠానం పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిది. అందులోనే జగన్ భక్త ఐపీఎస్లు పీఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి.. బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి టార్చర్ పెట్టారు. ఈ జగన్ భక్త ముగ్గురు ఐపీఎస్లపై గతంలో కూడా తీవ్ర ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. జగన్ ఆదేశాల మేరకు ప్రతిపక్ష పార్టీల నేతల్ని హింసించడం, ప్రశ్నించేవారిని అణచివేయడం, తప్పుడు కేసులతో ప్రజలను వేధించడం వారికి జగన్ పాలనలో అలవాటుగా మారింది. అలాంటి ఐపీఎస్ల పాపం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పండింది.