త్వరలో జరగబోతున్న గ్రేటర్ ఎన్నికలు రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలకు ఇది ప్రతిష్ఠాత్మం. అధికార టీఆర్ఎస్ ప్రస్తుత సీట్లకంటే ఎక్కువ సీట్లు సాధించాలని పట్టుదలతో ఉంటే, ఈసారి ఎలాగైన టీఆర్ఎస్ కు గట్టి గుణపాఠం చెప్పాలని మిగతా పార్టీలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ కు అత్యంత బలమైన ప్రాంతంగా గ్రేటర్ హైదరాబాద్ మారిపోయింది. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఇతర పార్టీల అభ్యర్థుల్ని సైతం ఓడించి వార్ వన్ సైడ్ అన్నట్టు ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసింది. అయితే ఉన్న సీట్లు కోల్పోయి తీవ్ర పరాభవంతో ఉన్న బీజేపీ మాత్రం గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి బుద్ధిచెబుతా మంటోంది.
రంగంలో కిషన్ రెడ్డి రెడీ…
ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగడం ఈ ఆలోచనకు బలం చేకూరుస్తోంది. కేంద్ర మంత్రి నియోజక వర్గం సికింద్రాబాద్ లో ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అంతే కాకుండా తన రాజకీయ జీవితం మొత్తం హైదరాబాద్ తోనే ముడిపడి ఉంది. దీంతో ఆయనకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం. టీఆర్ఎస్ , ఎం.ఐ.ఎం.లను ఒకే గాటన కడుతూ విమర్శలు గుప్పించే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు పార్టీల గడీలను బద్దలు కొడతామన్న ధీమాతో ఉన్నారు. ఇదే లక్ష్యంగా కిషన్ రెడ్డితో పాటు ఇతర బీజేపీ నేతలు గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎవరికి వారు చురుకుగా క్షేత్ర స్థాయిలో పనిచేసుకు పోతున్నారు.
అస్త్ర శస్త్రాలు అంతా సిద్ధం…
తాజాగా హైదరాబాద్ కు వచ్చిన కిషన్ రెడ్డి సైతం నియోజక వర్గాల వారీగా కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో నేతలు , కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను అందజేస్తున్నారు. కార్యకర్తల అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు మీ వెంటే ఉంటానని.. మీరు ముందుండి పోరాడమని సూచిస్తున్నారు కిషన్ రెడ్డి.
చెప్పిందేంటి…చేసిందేంటి…అడిగేద్దాం
గత ఐదేళ్ళుగా టీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ లో ఏం చెప్పింది ఏం చేసిందన్న దానిపైనే ప్రధాన దృష్టి సారించాలని భావిస్తోంది. పేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్రూం ఇళ్ళ మాటేంటి? కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నా ఇవ్వనివ్వలేదన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచిస్తున్నారు. నగరంలో గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి చేసి చూపెడతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న సంగతి ప్రజలకు తెలియజేయాలని భావిస్తోంది.
కలిసికట్టుగా నడవకుంటే నష్టమే…
రాష్ట్ర నాయకత్వం , కిషన్ రెడ్డి ఎన్ని చెప్పినా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేయక పోయినా.. విభేదాలు వీడక పోయినా గతంలో లాగే ఈ సారి కూడా నష్టం తప్పదన్న విషయాన్ని గుర్తుంచుకుని కలిసికట్టుగా పని చేయాలని కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ ముఖ్యనాయకులు.