దుబ్బాక గెలుపు రుచి బీజేపీకి బాగా వంటపట్టినట్లుంది. అందుకే మరో విజయం కోసం ఆ పార్టీ తహతహలాడుతోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిసారించింది. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు జాతీయ నాయకత్వం ఆ దిశగా ఫోకస్పెట్టింది. దానికి తగినట్లుగానే ముందస్తు ప్రణాళికలను వేస్తోంది. అందులో భాగంగానే జీహెచ్ఎంసి ఎన్నికల కోసం ఏకంగా జాతీయ నాయకత్వాన్నే బీజేపీ పార్టీ రంగంలోకి దింపింది. పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉత్సాహంలో నింపి ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సిద్ధమైంది. దీనికోసం ప్రత్యేక జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీని బీజేపీ పార్టీ నియమించింది. జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, నేతలతో కూడిన కమిటిని ప్రకటించింది. బీహార్, గుజరాత్ రాష్ట్రాల పార్టీ ఇంఛార్జీగా ఉన్న భూపేంద్ర యాదవ్ను జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంఛార్జీగా అగ్రనాయకత్వం నియమించింది. ఈయన పార్టీ జాతీయకార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. నిన్న జరిగిన బీహార్ ఎన్నికల విజయంలో ఆ రాష్ట్ర ఇంఛార్జీ అయిన భూపేంద్ర పాత్ర కూడా ఉంది. ఎప్పటి నుంచో హైదరాబాద్ మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ పార్టీ ఉవ్వీళ్లూరుతోంది. ఈక్రమంలోనే భూపేంద్ర యాదవ్తో పాటు మరికొంతమంది జాతీయ నాయకులను బల్దీయా ఎన్నికల కోసం రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
అలాగే ఈ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యవహరించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సహా ఇంఛార్జీలుగా కర్ణాటక రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సుధాకర్, ఆ రాష్ట్ర ఎమ్మెల్యే సతీష్రెడ్డి, గుజరాత్ రాష్ట్రానికి చెందిన పార్టీ నేత ప్రదీప్ సింగ్ వాఘేల, మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత ఆశిష్ షెల్లర్లను జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా నియమించారు. దీంతోపాటు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఈ కమిటీ ఛైర్మన్గా, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కమిటీకి కన్వీనర్గా వ్యవహరిస్తారు. అలాగే ఈ కమిటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాష్ట్ర నాయకత్వానికి కూడా స్థానం కల్పించారు. గతంలో కంటే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల విజయంపై బీజేపీ పార్టీ ప్రధానంగా దృష్టిసారించినట్లు ఈ కమిటీ నియామకనం చూస్తేనే మనకు అర్ధమవుతోంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడటం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి బాగా కలసివచ్చే అంశంగా కనబడుతోంది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటబాట పడుతూవస్తోంది.పైగా ఈ ఎన్నికల్లో దుబ్బాక విజయం తమకు బాగా కలిసి వచ్చే అంశమని పార్టీ నేతలు భావిస్తున్నారు.
Also Read ;- బల్దియా కావాలంటే.. కేసీఆర్ మెట్లు దిగక తప్పదు!