బాలీవుడ్.. ఇప్పుడు బ్యాడ్.. అగ్లీగా మారిందని ఈమధ్య కాలంలో ఎన్నో వార్తలు నిరూపించాయి. సుశాంత్ మరణం, ఆ తర్వాత డ్రగ్స్, నెపోటిజిం, చీకటి పరిచయాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడే అవుతుంది. ఇలాంటి వార్తలతో బాలీవుడ్ ను వీధిన పడేస్తున్నారంటూ మీడియా మీద గుర్రుగా ఉండేవారు ఎక్కువై పోయారు. మీడియాకు ముకుతాడు వేయాలనే ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. మీడియా అనేది అటు సినిమా రంగానికీ, ఇటు ప్రేక్షకులకూ వారధి లాంటిది. అలాంటి మీడియాకు ముకుతాడు వేయాలని దాదాపు 34 పెద్ద నిర్మాణ సంస్థలు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఆ మధ్య పాయల్ ఘోష్ అనే నటి ప్రముఖ దర్శకుడి మీద లైంగిక ఆరోపణలు చేసింది. దాంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. సినిమా రంగంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా దాన్ని బూతద్దంలో చూపుతున్నారంటూ ఆరోపించేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. సినిమా అనేది డబ్బుతో ముడిపడిన వ్యవహారం. డబ్బు విచ్చిలవిడిగా రొటేషన్ అయ్యే చోట రకరకాల జబ్బులు కూడా ఉంటాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే బ్యాచ్ కూడా ఎక్కువే. తాజాగా తరణ్ ఆదర్శ్ ఓ బ్రేక్ న్యూస్ పేల్చారు. బాలీవుడ్ మీద దుమ్మెత్తిపోస్తున్న మీడియా సంస్థపై కోర్టుకు వెళ్లేందుకు 34 పెద్ద నిర్మాణ సంస్థలు సిద్ధమవుతున్నాయనేది ఆ న్యూస్ సారాంశం.
ఇప్పటిదాకా ఏం జరుగుతున్నా నోరు మెదపకుండా ఉన్న సినీజనులంతా ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు. బాలీవుడ్ను బాగుండాలంటే మీడియాను నియంత్రించడం తప్ప వేరే మార్గాం లేనట్లుగా వారికి కనిపిస్తోందేమో. అదే జరిగితే ఇక బాలీవుడ్ లో అంతర్గతంగా జరిగే విషయాలు ఎలా వెలుగులోకి వస్తాయి, పాయల్ ఘోషను ఎవరు ఆలకిస్తారు? మరి ఇలాంటి ప్రశ్నలకు ఆ బాలీవుడ్ పెద్దలు సమాధానం చెప్పగలరో లేదో. బాలీవుడ్ పరువు తీస్తున్నవారిని కాపాడే ప్రయత్నాలకే వీరు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. మరి ఏంజరగబోతోందో చూడాలి.
BOLLYWOOD STRIKES BACK… Leading film associations [4] and top production houses [34] file lawsuit against reporting by certain media houses in #DelhiHC… #AamirKhan #AjayDevgn #AkshayKumar #SRK #AdityaChopra #KJo #RohitShetty #RiteshSidhwani #SajidNadiadwala pic.twitter.com/ZawJ2Lh6YY
— taran adarsh (@taran_adarsh) October 12, 2020