బైరెడ్డి… ఈ పేరు వినగానే ఇప్పుడేదో కుర్రకారు నోట వైసీపీకి చెందిన ఓ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు వినిపిస్తోంది గానీ… ఆ పేరు వింటేనే రాజకీయాల్లో రాయలసీమ హావభావాలు ఇట్టే కనిపించే బైరెడ్డి రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. ఇటీవల కాలంలో ఆయన పెద్దగా లైమ్ లైట్ లోకి రావడం లేదు గానీ… తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన కోసం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు, ప్రత్యేకించి రాష్ట్ర విభజనతో ఏపీకి జరగబోయే నష్టం, అందులోనూ రాయలసీమ ప్రాంతానికి జరిగే తీవ్ర నష్టాన్ని ఎలుగెత్తి చాటేందుకు ఒంటరిగానే బరిలోకి దిగిన నేతగా బైరెడ్డి ఓ వెలుగు వెలిగారు. తన సొంత జిల్లా కర్నూలుతో పాటు రాయలసీమ జిల్లాలు… ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు పరిచయం అక్కర్లేని నేతగా ఎదిగిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి అంత త్వరగా ఎందుకు తెరమరుగయ్యారు? ఈ ప్రశ్న నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. తెలుగు దేశం పార్టీ తరఫున వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన బైరెడ్డి ప్రస్థానాన్ని కాస్తంత లోతుగా చూద్దాం పదండి.
తెలివైన వ్యూహాలతో ప్రత్యర్థుల చిత్తు
సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ బైరెడ్డి శేషశయనారెడ్డి కుమారుడిగా, రాజకీయాల్లో ఆయన వారసుడిగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలుగు నేల పాలిటిక్్స లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే.. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కేంద్రంగా తనదైన శైలి వ్యూహాలతో సాగారు. అప్పటిదాకా బలంగా ఉన్న ప్రత్యర్థులను తెలివైన వ్యూహాలతో చిత్తు చేసిన రాజశేఖరరెడ్డి, హత్యా రాజకీయాలతో తనను అంతమొందించేందుకు యత్నించిన ప్రత్యర్థులను పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టించి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. అంతిమంగా ఫ్యాక్షన్ నేలకు చెందిన వారైనా, ఆ ఛాయలకు పోకుండా చేతులకు మట్టి అంటకుండా ప్రత్యర్థులకు కళ్లెం వేసి టీడీపీ అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు హయాంలో 1994లో నందికొట్కూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బైరెడ్డి బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి రెండో పర్యాయం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో గెలిచారు. అప్పటికే వరుసగా రెండు పర్యాయాలు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం, ప్రత్యర్థులపై తనదైన శైలి వ్యూహాలు అమలు చేసి ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమ గీతం పాడే దిశగా సాగుతున్న బైరెడ్డికి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి ఖాయమన్న వాదనలు కూడా బలంగానే వినిపించాయి. అయితే కర్నూలు జిల్లాకు సంబంధించిన చాలా మంది సీనియర్ నేతలున్న నేపథ్యంలో బైరెడ్డికి అవకాశం దక్కలేదన్న విశ్లేషణలు జరిగాయి. అంతిమంగా మంత్రిగా అవకాశం దక్కకున్నా బైరెడ్డికి మాత్రం టీడీపీలో ఓ రేంజి ఎలివేషన్ దక్కింది. పార్టీలో మంచి ప్రాధాన్యత దక్కింది. 2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురైనా కూడా బైరెడ్డికి పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యం తగ్గలేదనే చెప్పాలి. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే, ఆ వెంటనే వరుసగా రెండు ఓటములతో బైరెడ్డి స్థిమితంగా ఉండలేకపోయారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన దిశగా కేంద్రం అడుగులతో మరింత కంగారుపడ్డ బైరెడ్డి టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
టీడీపీ నుంచి నిష్క్రమించిన నాటి నుంచే..
ఎప్పుడైతే టీడీపీ నుంచి నిష్క్రమించారో అప్పటి నుంచే బైరెడ్డి పతనం మొదలైందని చెప్పాలి. తొలుత టీడీపీ నుంచి బయటకు రాగానే రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట పార్టీ పెట్టుకుని రాయలసీమ కోసం పని చేసిన బైరెడ్డి ఆ దిశగా మరింతగా పోరు సాగించేందుకు ఎందుకనో సిద్ధపడలేదనే చెప్పాలి. నందికొట్కూరుపై, ఆ నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలపై పట్టును సరిగా అంచనా వేయలేకపోయిన బైరెడ్డి తదుకనుగుణంగానే తప్పులో కాలేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి బయటకు వచ్చాక తన బలమేంటో తనకు అర్థమైపోయిన తర్వాత చేసేదేమీ లేని బైరెడ్డి తిరిగి ఏదో ఒక పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. తిరిగి టీడీపీ గూటికి వద్దామనుకున్నా పరిస్థితులు సహకరించలేదు. కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. అక్కడ కుదురుకోలేక పార్టీ నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత తాను కాలుపెట్టని పార్టీగా కనిపించిన బీజేపీలో చేరారు. ఇప్పుడు బైరెడ్డి అసలు బీజేపీలోనే ఉన్నారా? ఇంకేదైనా పార్టీలో ఉన్నారా? అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. బైరెడ్డి బీజేపీలో ఉన్నా గానీ ఈ తరహా ప్రశ్నలు ఉదయిస్తున్నాయంటే బైరెడ్డి ఎంతగా తెరమరుగు అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.