(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ప్రధాని మోడీ అమరావతి రాజధానికి శంకుస్థానప చేసి నేటికి సరిగ్గా ఐదేళ్లు. ప్రపంచ స్థాయి, ప్రజారాజధాని వస్తుందని అందరూ ఆశించారు. ఢిల్లీని తలదన్నే రాజధాని వస్తుందని భావించారు. నాలుగేళ్లు గడిచే సరికి ఆశలు అడియాసలు అయ్యాయి. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రాజధాని పనులు నిలిచిపోయాయి. వేలాది మంది కార్మికులతో రాత్రిపగలు తేడా లేకుండా నిర్మాణాలు సాగిన ప్రాంతం నేడు వెలవెల పోతోంది.
అమరావతి ఎప్పటికీ ప్రజారాజధానే…
ఏపీ ప్రజలందరికీ సమాన దూరంలో అమరావతి ఉంది. అటు కుప్పం, హిందూపురం నుంచి రాజధానికి రావాలన్నా ఇఛ్చాపురం ప్రజలు రాజధానికి చేరుకోవాలన్నా సమానదూరంలో ఉంటుందనే ఉద్దేశంలో అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. రాజధాని అవసరాలకు పక్కనే కృష్ణా నది ఉంది. వేసవిలోనూ నీటి కొరత లేకుండా పుష్కలంగా నీరు దొరుకుతుంది. ఏ నాగరికత అయినా నదీ తీరాల్లోనే విలసిల్లిందనేని చరిత్ర చెబుతోంది.
వీటన్నింటికి తోడు 29 వేల మంది రైతులు మూడు పంటలు పండే 34 వేల ఎకరాల భూమిని రాజధానికి దానం చేశారనే చెప్పవచ్చు. ఒక్కరూపాయి తీసుకోకుండా 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని కోసం నమ్ముకున్న భూములను ప్రభుత్వానికి అప్పగించారు. టెక్నికల్ గా ‘ఉచితంగా ఇవ్వలేదు కదా’ అని వాదించవచ్చు. కాగితాల మీద లెక్కల పరంగా.. వారికి రియల్ ఎస్టేట్ వేల్యూ బాగానే గిట్టుబాటు అవుతుంది కదా అని అడ్డంగా వాదించవచ్చు. కానీ.. రాజధాని అనే ఒక లక్ష్యంకోసం సమష్టి ఒప్పుకోలుతో వారు వ్యవసాయ భూములు ఇవ్వడం వెనుక ఉన్న సంకల్ప శుద్ధిని శంకించలేం.
అన్ని వనరునలూ సమకూరాయి. భూమి,నీరు, అందరికీ సమాన దూరంలో రాజధానిగా అమరావతి పది కాలాలపాటు విలసిల్లుతుందని అందరూ భావించారు. నాలుగు సంవత్సరాలపాటు రైతుల ఆశలు సజీవంగా ఉన్నాయి. నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. నాలుగేళ్లలో ఎన్నో విద్యాలయాలు నిర్మించారు. హైకోర్టు, సచివాలయం నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారుల నివాస సముదాయాలు దాదాపుగా సిద్దం అయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు 90 శాతం పూర్తి చేశారు. ఇవన్నీ రైతుల్లో ఆశలు నింపాయి. అంతలో ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వాలు మారాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో రైతుల ఆశలే కాదు, 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధానికి సమాధి కట్టారు.
నాడు కళకళ – నేడు విలవిల
అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో తెలుగు వారంతా సంతోషించారు. రాష్ట్రం నడిబొడ్డులో రాజధాని రావడంతో ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు. రాజధాని ప్రకటన రాగానే భూసేకరణ ప్రారంభించారు. ఎవరూ ఊహించని విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 34 వేల ఎకరాలు సేకరించారు. ప్రపంచంలోనే ఇదొక రికార్డు. ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామంటున్నా అనేక ప్రాజెక్టులకు భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రాని తరుణంలో ఒక్క రూపాయి పరిహారం తీసుకోకుండా, కేవలం వారిచ్చిన భూమిలో నాలుగోవంతు తిరిగి తీసుకునే ఒప్పందం ద్వారా వేలాది ఎకరాల భూములను రైతులు ప్రభుత్వానికి కట్టబెట్టారు.
రైతుల కష్టం ఊరికేపోదంటారు. గత ప్రభుత్వం భూసేకరణ పూర్తి కాగానే పెద్ద ఎత్తున నిర్మాణ పనులు ప్రారంభించింది. మౌలిక సదుపాయాలకు, భవనాల నిర్మాణాలకు రూ.10000 కోట్లు ఖర్చు చేసింది. వెలగపూడి సచివాలయం, హైకోర్టు, సీడ్ యాక్సెస్ రోడ్డు, అధికారుల నివాస సముదాయాలు పూర్తి చేసింది. రెండు ప్రయివేటు యూనివర్శిటీలు భారీ భవనాలు నిర్మించుకుని, తరగతులు కూడా ప్రారంభించాయి. కలల రాజధాని విద్యా కేంద్రంగా, ప్రజారాజధానిగా విలుసిల్లుతుందని అందరూ భావించారు.
కానీ 2019 ఎన్నికల్లో ప్రజల తీర్పు అమరావతికి శాపంగా మారింది. ప్రభుత్వం మారింది. వారి ఆలోచన విధానాలు కూడా మారాయి. మూడు రాజధానుల ప్రకటన చేశారు. అంతే అమరావతిలో నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిపివేశారు. నిర్మాణ కార్మికులతో కళకళలాడిన అమరావతి రాజధానిలో నేడు నిశ్శబ్దం ఆవరించింది. అమరావతిని ఎలాగైనా బతికించుకునేందుకు రాజధాని రైతులు చేస్తున్న పోరాటాలు 309 రోజులకు చేరుకున్నాయి. 95 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం కనిపించడం లేదు.
నేడు మహాపాదయాత్ర
అమరావతి రాజధానికి ప్రధాని మోడీ శంకుస్ధాపన చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి మహాపాదయాత్ర చేపట్టింది. గుంటూరు నుంచి ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వరకూ రైతులు, ప్రజా సంఘాలు మహాపాదయాత్ర చేపట్టాయి. అయితే పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని రైతులు తప్ప ఎవరూ ఈ ప్రాంతానికి రావడానికి వీల్లేదని పోలీసు అధికారులు ప్రకటించారు.
కరోనా పేరుతో వంద మందికి మించి ఎవరూ గుమిగూడటం, ర్యాలీలు చేయడం నిషిద్దం అంటూ పోలీసులు చెబుతున్నారు. అజరామరమైన అమరావతిని బతికించుకునేందుకు వేలాది రైతులు కదలి వస్తున్నారు. పోలీసులు అడ్డంకులు పెట్టినా మహాపాదయాత్రను అడ్డుకోలేరని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతిని బతికించుకుంటామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.