జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఖాళీగా ఉంటూ బెంగళూరు – అమరావతి మధ్య తరచూ టూర్లు వేస్తున్నారు. ఎక్కువ కాలం బెంగళూరు ప్యాలెస్లో గడుపుతూ.. ఏపీలో ఏదైనా నిరసన చేయాల్సి వచ్చినప్పుడు లేదా ఎవరినైనా పరామర్శించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అమరావతికి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పవర్ లేని జగన్ కు తన భవిష్యత్తుపైనే అధికమైన బెంగ నెలకొంది. ఇప్పటికి తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు కాకుండా ఇంకెన్ని కేసులు తనపై కూటమి ప్రభుత్వం పెడుతుందో అని వణికిపోతున్నారు. ఏవైపు నుంచి ఏ కేసు తనను వెతుక్కుంటూ వచ్చి, తాను ఏ క్షణాన జైలు పాలు అవుతానో అని కంగారుపడిపోతున్నారు. అందుకే ఎక్కువ రోజులు బెంగళూరులో జగన్ ఉంటున్నట్లుగా చెబుతున్నారు.
అయితే, జగన్ రెడ్డికి ఇప్పుడు పెద్దగా పనులు లేకపోవడంతో.. విదేశీ పర్యటనకు ప్లాన్ చేశారు. మరి తాను దేశం దాటాలంటే కోర్టు పర్మిషన్ ఉండాల్సిందే. అక్రమాస్తుల కేసులు అన్ని విచారణ దశలో కోర్టులో ఉన్నాయి. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ తన ఇష్టమొచ్చినప్పుడు ఫారిన్ టూర్ కు వెళ్లే వీలు లేదు. అందుకే గత ఎన్నికలు ముగిసీ ముగియగానే.. ఫలితాలు వచ్చేలోపే.. కోర్టు అనుమతి తీసుకొని జగన్ యూకే పర్యటనకు వెళ్లొచ్చారు.
ఇప్పుడు మరోసారి జగన్ యూకేకు వెళ్లబోతున్నారు. అందుకోసం కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ జగన్ పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. జగన్ పిటిషన్పై వాదనలు బుధవారం ముగిశాయి. కోర్టు తన తీర్పును ఈ నెల 27కు వాయిదా వేసింది. యూకేలో చదువుకుంటున్న తన కుమార్తె దగ్గరికి సెప్టెంబరు మొదటి వారంలో తాను వెళ్లాలనుకుంటున్నానని.. అందుకు అనుమతించాలని పిటిషన్లో జగన్ కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో సీబీఐ నేడు వాదనలు వినిపిస్తూ జగన్ బ్రిటన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టుకు తెలిపింది.
దీంతో కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎన్నికలు ముగిశాక యూకే వెళ్లిన సమయంలో జగన్ సీఎం హోదాలో ఉన్నారు. కానీ, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఈ స్థితిలో కోర్టు జగన్ కు బెయిల్ ఇవ్వడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్ది వారాల క్రితమే జగన్ తన పాస్ పోర్టును విజయవాడలోని పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లి రెన్యువల్ చేయించుకున్న సంగతి తెలిసిందే.