ఏపీలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులోభాగంగా కేంద్రప్రభుత్వం ఏపీపై వరాలు ప్రకటించింది. పెండింగ్ అంశాలతో పాటు విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏపీ రాజధాని అమరావతి-తెలంగాణ రాజధాని హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర హోం శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు తిరుపతి – కాట్పాడి రైల్వే లైన్ డబ్లింక్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ డబ్లింగ్ పనులకు రూ.1,332 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపింది. మొత్తం 104 కిలో మీటర్ల మేర డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు.
అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించిన కేంద్రం..ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక-DPRను రూపొందించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణాశాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డు, హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు అనుమతులు జారీ చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను వేగంగా పరిష్కరించాలని కేంద్రం భావిస్తోంది.
ఏపీకి స్పెషల్ –
ఏపీలో ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. అయితే, రాష్ట్రంలో మరో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలని ఏపీ చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్టణం-విజయవాడ-హైదరాబాద్-కర్నూలు రైలు కారిడార్ ఏర్పాటు అంశాన్ని త్వరగా పరిశీలించాలని రైల్వే శాఖను హోంశాఖ కోరింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ముమ్మరంగా సాగించాలని, రెండేళ్లలో అక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు
చేపట్టాలని పేర్కొంది. అదేవిధంగా..ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, విభజన చట్టంలోని షెడ్యూలు 9లో పేర్కొన్న కార్పొరేషన్లు, కంపెనీలు, షెడ్యూలు 10లోని సంస్థల విభజన, విదేశీ రుణ సాయంతో చేపట్టే ప్రాజెక్టులపైనా కేంద్ర హోం శాఖ దృష్టి పెట్టింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుల పంపిణీపై కూడా కేంద్ర హోంశాఖ చర్చించింది. అయితే, వీటిపై అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు మరో రూ.350 కోట్లను గ్రాంట్ రూపంలో త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం కేంద్రం ఇప్పటికే రూ.135 కోట్లు విడుదల చేసింది. అదే విధంగా పూసాలో ఉన్న వ్యవసాయ పరిశోధనా సంస్థ దక్షిణాది క్యాంప్సను ఏపీలో నెలకొల్పాలని కూటమి సర్కార్ చేసిన ప్రతిపాదనను పరిశీలించాలని తాజాగా నిర్ణయించింది. రెండేళ్లలో విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, అప్పటి వరకు తాత్కాలిక కార్యకలాపాలను నిర్వహించాలని రైల్వే బోర్డుకు హోం శాఖ సూచించింది.
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి సమస్యల పరిష్కారం, ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర హోం శాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా వివిధ మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థల ప్రాజక్టుల పురోగతిపై సమీక్షించింది. ప్రతి రెండు నెలలకోసారి సమావేశమై విభజనకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన నిధుల పంపిణీ విషయంలో పరిష్కారం కనుగొనేందుకు CAGకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఉమ్మడి సంస్థల నిర్వహణపై తెలంగాణ చేసిన ఖర్చు తిరిగి చెల్లించే విషయం కూడా కాగ్కు నివేదించనున్నారు. కాగా, తదుపరి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు, విద్యాసంస్థల ఏర్పాటు, ఏపీలో గ్రేహౌండ్స్ సెంటర్ ఏర్పాటుపై చర్చించాలని నిర్ణయించారు.