తెగించి పోరాడే వాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతి ఉప ఎన్నికకు ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా వ్యాఖ్యానించారు. గురువారం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై లోకేష్, అచ్చెన్నాయుడు, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్లతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేలోపు ఇదే పెద్ద ఉప ఎన్నిక అని, క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని చంద్రబాబు హెచ్చరించారు. రిజర్వేషన్లు, విధేయతలు, మోహమాటాలు ఇకపై చెల్లవని స్పష్టం చేశారు. వైసీపీ వైఫల్యాలపై పది అంశాలు గుర్తించి ప్రతి ఇంటికి వాటిని నాయకులు వివరించాలని తెలిపారు. ప్రతి క్లస్టర్కు ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఐదుగురితో తిరుపతి ఉపఎన్నిక పర్యవేక్షణ కమిటీ ఉంటుందని స్పష్టం చేశారు. నాయకులు క్షేత్రస్థాయి పనితీరుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అద్దంపడుతున్నాయన్నారు.కాగా, ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నట్లు తిరుపతి ఉప ఎన్నిక టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ చంద్రబాబుకు తెలిపారు.
Must Read ;- లెక్కలేసుకుంటున్నారు.. తిరుపతి తమదే అంటున్నారు!