కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. దశాబ్ధాలుగా అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించింది. దాదాపు 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కింది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణను గురువారం కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మంగళవారం ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
తర్వాత గవర్నర్ కార్యాలయానికి పంపగా, బుధవారం గవర్నర్ ఆమోదించారు. దీంతో గురువారం అధికారికంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్-2025కి సంబంధించిన గెజిట్ GO-19 నోటిఫికేషన్ను న్యాయశాఖ
సెక్రటరీ ప్రతిభా దేవి రిలీజ్ చేశారు.దీంతో గురువారం నుంచి వెలువడే నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తించనుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించి పోస్టుల భర్తీ, కేంద్రం ఆధీనంలో ఉండే కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, విద్యా సంస్థలకు మాత్రం ఈ వర్గీకరణ వర్తించదు.
గతేడాది ఆగస్టులో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంటూ..ఆయా వర్గాల వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు..రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై అధ్యయనానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పలు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించింది. వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, పథకాల అమలు తీరును పరిశీలించింది.
ఐదు నెలలపాటు చేసిన సుదీర్ఘ అధ్యయనం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి 360 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. అంతకుముందు 2000 సంవత్సరంలోనూ ఎస్సీ వర్గీకరణ టీడీపీ ప్రభుత్వంలోనే అమలైంది.
59 ఉప కులాలకు మేలు –
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నింటికీ విద్య, ఉద్యోగాల్లో సమాన, న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా..మొత్తం 15 శాతం రిజర్వేషన్లను మూడు భాగాలుగా ఏకసభ్య కమిషన్ విభజించింది. గ్రూప్-1 కింద రెల్లి, ఉపకులాలు (12 కులాలు) చేర్చి 1% రిజర్వేషన్, గ్రూప్-2 కింద మాదిగ, ఉపకులాలు (18 కులాలు) చేర్చి 6.5% రిజర్వేషన్, గ్రూప్-3 కింద మాల, ఉపకులాలు (29 కులాలు) చేర్చి 7.5% రిజర్వేషన్ కేటాయించింది. దీంతో ఎస్సీల్లోని 59 ఉప కులాలకు లబ్ధి చేకూరనుంది. ఈ ప్రక్రియకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకున్నారు. రాష్ట్రం యూనిట్గా అమలు చేయనున్నారు. తదుపరి జనాభా లెక్కల తర్వాత ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
దశాబ్ధాల సమస్యకు ఏడాదిన్నరలోనే పరిష్కారం –
కూటమి గతేడాది జూన్లో అధికారం చేపట్టింది. ఆ తర్వాత ఎనిమిదిన్నర నెలల్లోనే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమల్లోకి తెచ్చింది. 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. 2024 నవంబరు 7న అమలుకు కార్యాచరణ ప్రకటించారు. 2024 నవంబరు 15న రాజీవ్ రంజన్ మిశ్ర ఏకసభ్య కమిషన్ నియామించింది కూటమి ప్రభుత్వం. 2025 మార్చి 10న ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. 2025 మార్చి 20న కమిషన్ నివేదికకు శాసనసభ ఆమోదం తెలిపింది. 2025 ఏప్రిల్ 14న జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి సంబంధిత దస్త్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. 2025 ఏప్రిల్ 15న ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025 ఏప్రిల్ 16న ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించారు. దీంతో 2025 ఏప్రిల్ 17న ఆర్డినెన్స్-2025 గెజిట్ విడుదలైంది.