పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం గుడ్ న్యూస్ వినిపించింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులను విడుదల చేసింది. రూ.2,800 కోట్ల నిధులను రిలీజ్ చేయగా.. ఏ పద్దుల కింద ఈ నిధులను విడుదల చేశారో సమాచారం లేదు. అయితే, పాత బిల్లుల రీయింబర్స్మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా పనులు చేపట్టేందుకు రూ.2 వేల కోట్లు ఇచ్చినట్లుగా ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రీఎంబర్స్ చేస్తూ ఉంది. అంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి పనులు చేపిస్తే, ఆ బిల్లులు పంపించాక నిధులు కేంద్రం నుంచి విడుదల అవుతాయి.
జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాలో డబ్బు లేక అడ్వాన్సుగా నిధులు ఇవ్వాలని పదేపదే కోరినా ఆ ప్రయత్నాలు కుదరలేదు. అడ్వాన్స్గా ఇచ్చేందుకు తొలిసారిగా మోదీ సర్కారు అంగీకారం తెలిపింది. నెల రోజుల క్రితమే రూ.30,436 కోట్లతో ప్రాజెక్టు కొత్త డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఇచ్చిన నిధులు పోనూ రూ.12,157 కోట్లు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు వీలు దొరికింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఈ నిధులు అడ్వాన్సుగా ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లు, వచ్చే ఏడాది రూ.6,157 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే, పోలవరంలో పనులకు సంబంధించి కేంద్రం నుంచి బకాయిలు కూడా ఉన్నాయి. దాదాపు రూ.1,615.47 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని సమాచారం. అయితే ప్రభుత్వం రూ.1,615.47 కోట్ల విలువైన పనులు చేసినా కూడా, అందులో కాంట్రాక్టలర్లకు చెల్లించిన మొత్తం రూ.800 కోట్లే ఉన్నాయి. పైగా పాత డీపీఆర్ ప్రకారం ఆ నిధులు ఇచ్చేందుకు ఆస్కారం లేకుండా ఉంది. ప్రస్తుతం కొత్త డీపీఆర్ ఆమోదం పొందడంతో అందులో నిధులు తీసుకునేందుకు వెసులుబాటు దక్కింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెల్లించి, బిల్లులు కూడా సమర్పించిన రూ.800 కోట్లు రీయింబర్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే రూ.2 వేల కోట్లు తక్షణమే అడ్వాన్స్గా కావాలని అడిగినందున ఆ మొత్తమూ ఇచ్చి ఉంటారని పోలవరం అధికారులు చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం అయిన తర్వాత కేంద్రం నుంచి ఇంత వేగంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆసక్తిగా మారింది. పైగా అడ్వాన్సు రూపంలో నిర్మాణం కోసం నిధులు ముందే మంజూరు కావడం, పైగా విడుదల కావడం కూడా ఇదే తొలిసారని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామంతో పోలవరం కాంట్రాక్టు దారుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఫలితంగా వారు రెట్టించిన ఉత్సాహంతో పనులు చేస్తారని అంటున్నారు.