ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా రాజధానిని నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు తీరే విధంగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఆ హామీతోనే ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్తో ప్రజలు కూటమిని గెలిపించారన్నారు చంద్రబాబు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రాజధానికి భూములు సేకరించామని, రైతులు సైతం స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు. రాజధాని రైతుల అవిరామ పోరాటానికి త్వరలోనే ఫలితం దక్కుతుందన్నారు చంద్రబాబు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ADB రుణం ఇచ్చాయన్నారు చంద్రబాబు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని వివరించారు. 3 ఏళ్లలోనే రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాలన్ని పూర్తి చేస్తామన్నారు. అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్రను ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు హైదరాబాద్ ఆదాయవనరుగా మారిందన్నారు.
ఇక శుక్రవారం ప్రధాని మోదీ అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పారు చంద్రబాబు. రాజధానిలో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని వివరించారు. దీంతో పాటు DRDO, DPIIT, NHAI, రైల్వేకు సంబంధించి దాదాపు రూ.57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. ఆర్థిక కష్టాలున్నా.. ఈ 10 నెలల్లో పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. విశాఖపట్నంలో టీసీఎస్ స్థాపన ద్వారా భారీగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.
భోగాపురం విమానాశ్రయాన్ని కూడా శరవేగంగా నిర్మిస్తున్నామని.. శ్రీసిటీలో ఎల్జీ కంపెనీ రూ.5 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టనుందని చెప్పారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు స్వర్ణాంధ్ర విజన్-2047 రూపొందించుకున్నామని..అన్ని ప్రాంతాల అభివృద్ధే ఎన్డీయే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
విశాఖలో ఉర్సా కంపెనీ పెట్టుబడులపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు చంద్రబాబు. ఎకరం భూమి రూ. కోటి, రూ.50 లక్షలకు కేటాయించామన్నారు. 99 పైసలకే ఎకరా భూమి ఇచ్చామని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ నేతలు చేసిన తప్పులు ఎవరూ చేయలేదని.. మద్యం, ఇసుక, గనులు, భూములు ఇలా అన్నింటిలోనూ దోచుకున్నారని మండిపడ్డారు.
మరోవైపు ప్రజలకు గుడ్న్యూస్ చెప్పారు చంద్రబాబు. వచ్చే నెలలో అన్నదాత, తల్లికి వందనం పథకాలు ప్రారంభిస్తామన్నారు. కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా ఏ నాయకుడూ వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యం ఇస్తానో.. కార్యకర్తలకు కూడా అంతే ఇస్తానన్నారు. కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించేందుకు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నామన్నారు. జిల్లాల పర్యటనకు వెళ్లిన సమయంలో ఇప్పటికే 8 నియోజకవర్గాల కార్యకర్తలతో నేరుగా సమావేశమయ్యానని..పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలని చెప్పుకొచ్చారు. కడపలో మహానాడును ఘనంగా నిర్వహించుకుందామని..ఏ ఎన్నికలు జరిగినా ఎన్డీయేనే గెలవాలని కార్యకర్తలకు సూచించారు.