సినిమా థియేటర్ కు ఓటీటీ ప్రత్యామ్నాయం అవుతుందా? నిర్మాతలకు ఓటీటీ వల్ల ఒనగూరేదేంటి? లాంటి ప్రశ్నలు ఇటీవల తరచూ వినిపిస్తున్నాయి. ఓటీటీ సత్తా ఏంటో నిర్మాతలకు తెలిసిపోయింది. ఇలాంటి కరోనా కాలంలో కొందరికి ఇది బంగారు బాతులాగా కనిపించినా వచ్చిన ఫలితం చూస్తుంటే గుడ్లు తేలేయాల్సి వస్తోంది. ఈ బాతును కోసుకుందామనుకుంటే ఈ బాతే నిర్మాతలను కోసేసేలాగా ఉంది. సినిమా థియేటర్ లో విడుదల కావడానికీ, ఓటీటీలో విడుదల కావడానికీ మధ్య చాలా తేడాలు ఉంటాయి.
కరోనా కాలంలో సినిమాకి చేసిన అప్పుల నుంచి బయట పడటానికి ఓటీటీ ఓ ఆప్షన్ గా ఫీలయ్యారు తప్పితే ఓటీటీ బిజినెస్ ఆశలను నిండా ముంచేశారు ‘ వి ‘, ‘ నిశ్శబ్దం ‘ , ‘ఒరేయ్ బుజ్జి’గా దర్శకనిర్మాతలు. నిజంగా ఈ సినిమాలు థియేటర్స్ లో రిలీజైతే మాట్నీ షో కూడా ఫుల్ కావడం కష్టమే. ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీ వేదికలపై రిలీజ్ అవుతున్న ఈ సినిమాలన్నీ థియేటర్స్ కోసం తీసినవే. థియేటర్స్ లో సినిమా చూడటానికి మీడియా ద్వారా మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు. ఈ ఫలానా సినిమా ఫలానా జోనర్ లో ఉంటుందని, ఇలాంటి హైలైట్స్ ఉన్నాయని ప్రచారం చేస్తారు.
ఓటీటీ రిలీజ్ అనుకునేటప్పటికీ ప్రచారాన్ని గాలికి వదిలేస్తున్నారు. థియేటర్ కి వచ్చేవాడు అన్నివిధాలా సంసిద్ధమై రూ. 500 నుంచి1 000 రూపాయిల వరకు సినిమా హాలులో ఖర్చు పెడతాడు. ఆ సినిమా ఎలా ఉన్నామధ్యలో లేచి వెళ్ళడు. అదే ఓటీటీ విషయానికి వస్తే ప్రేక్షకుడి చేతిలో రిమోట్ అనే వజ్రాయుధం ఉంది. పైగా సినిమాలకు రివ్యూలు రాసేవారి వల్ల కూడా సినిమాకి డ్యామేజ్ జరిగిపోతోంది. రెండున్నర గంటల సినిమాని ముందుకు జరిపేసి త్వరగా రివ్యూ ఇచ్చేస్తున్నారు కూడా ఉన్నారు. దీనివల్ల కూడా సినిమాకి మరింత డ్యామేజ్ జరిగిపోతోంది. సినిమా బాగోకపోతే చూసేవాడికి కనీసం అరడజను ఓటీటీ వేదికలు, ఇంకో 30 తెలుగు ఛానెల్స్ ఉంటాయి.
కొత్త సినిమా ఫ్రీ గా వచ్చింది అనే చిన్నపాటి ఆసక్తి, అందులోని నటీనటుల మీద ఉన్న క్రేజ్ తో చూడటానికి కూర్చుంటాడు. నిజం చెప్పాలంటే ఓటీటీ రిలీజయ్యే సినిమాలకే ఎక్కువ పబ్లిసిటీ చెయ్యాలి. మరొక అంశం ఏమిటంటే ఓటీటీ ప్రేక్షకులు థ్రిల్లర్ సినిమాలు ది బెస్ట్ చూసి ఉంటారు. ఆ స్థాయిలో తెలుగు థ్రిల్లర్స్ పోటీపడటం కష్టం. ఎవడి నేపథ్యంలో, ఆ నేటివిటీ తో ఎమోషన్స్ తో సినిమాలు తీస్తేనే మంచిది. వ్యాపారం పరంగా చూసుకుంటే థియేటర్స్ లో రిలీజయ్యే సినిమా ఆ హీరో గత సినిమా ఎంతకి కొన్నారు? ఎంత వసూలు చేసింది అనే దాని మీద బిజినెస్ జరుగుతుంది.
అదే ఓటీటీ విషయానికి వచ్చేటప్పటికి హీరో హీరోయిన్లను చూసి సినిమాని కొనరు. అంతకుముందు వాళ్ళు కొన్న సినిమా ఫలితాన్ని బట్టి కొంటారు. అంటే నెక్స్ట్ కొనబోయే తెలుగు సినిమాలకు రేటు నిర్ణయించేది దీన్ని బట్టే. -‘నిశ్శబ్దం’కి వచ్చే ఆదరణన బట్టే ఓటీటీలో తర్వాత వీరి ధర ఆధారపడి ఉంటుంది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా బేరాలాడక తప్పదు. అక్టోబరు15 నుంచి థియేటర్లు తెరుస్తున్నారు. కాబట్టి థియేటర్స్ లోనే రిలీజ్ చేసుకోవడం మంచిదనే అభిప్రాయానికి చాలామంది వచ్చేశారు. లేదా ఓటీటీలో విడుదల చేయాలంటే ఓటీటీ కోసమే ప్రత్యేకంగా సినిమా చేయడం మంచిది. అంతేతప్ప ప్రేక్షకులకు నచ్చని కంటెంట్ ను ఓటీటీ మీద పడేసి ఆ బంగారు బాతుని కోసుకోకుండా ఉంటే సినిమాకి మంచిది.