ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ జగనన్న సెంటు భూమి పంపిణీ కార్యక్రమం కృష్ణా జిల్లాలో అభాసుపాలౌతోంది. లాటరీ పద్దతి ద్వారా లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి కాని అలా జరగడం లేదు. అయిన వారికి ఊరికి దగ్గరగా రోడ్డు పక్కగా ఉంటే స్థలాలను కట్టుబెట్టేందుకు అధికారపార్టీ నేతలు పావులు కదిపారు. దీంతో లాటరీ విధానం కృష్ణా జిల్లాలో నిలిచిపోయింది. ముందుగా పార్టీ సానుభూతిపరులకు, సెంటు భూమికోసం లంచాలిచ్చిన వారికి వారు కోరుకున్న స్థలాలు కేటాయిస్తున్నారు. ఇక మిగిలిన వారికి ఊరికి దూరంలో వెంచర్లో చివరి భాగంలో స్థలాలు కేటాయించడంపై లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి వెంచర్లలో అయిన వారికి రోడ్డుకు దగ్గరగా స్థలాలను కట్టబెట్టారని లబ్దిదారులు ఆందోళనకు దిగారు.
ఇచ్చినవారికే మరలా…
తాజాగా ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు తీసుకునే లబ్దిదారులు 1996 తరవాత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్థలం కాని, గృహ నిర్మాణ పథకాలు కానీ పొంది ఉండకూడదనే నిబంధన విధించారు. అయితే కృష్ణా జిల్లా అధికారులు ఈ నిబంధనలు తుంగలో తొక్కారు. నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం, మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం,కొండపల్లి, విజయవాడ రూరల్ నున్న గ్రామాల్లో గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు పొందిన వారికే మరలా కేటాయించడం వివాదాస్పదంగా మారింది. కొందరు పేదలకు అసలు స్థలం రాకపోవడం, మరికొందరు రెండోసారి ఇంటి స్థలం పొందడం కొన్ని ప్రాంతాల్లో వివాదాలకు దారితీసింది.
మునక భూములు మాకొద్దు
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామలో ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై లబ్దిదారులు ఆందోళనకు దిగారు. వేసవిలో కూడా నీరు నిలిచి ఉండే భూములు, మురుగునీటి కాలువ స్థలం కేటాయించడంపై ఆందోళనకు దిగారు. మెరక భూములు గ్రామానికి దగ్గరగా ఉంటే స్థలాలు కేటాయించాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. లోతట్టు స్థలాలు కేటాయించడంతోపాటు, కనీసం మట్టి రోడ్డు కూడా వేయలేదని తమ స్థలం వెతుకున్నా కనిపించలేదని లబ్దిదారులు వాపోయారు. ప్రభుత్వం లక్షలాది మందికి స్థలాలు ఇస్తున్నామని చెబుతున్నా వాటిలో నివాసయోగ్యానికి పనికివచ్చేవి సగం కూడా లేవనే విమర్శలు వస్తున్నాయి.
విజయవాడ రూరల్ గ్రామాల్లో వింత పరిస్థితి
విజయవాడ పట్టణంలో నివసించే 80 వేల మంది పేదలకు విజయవాడ రూరల్ గ్రామాల్లో సెంటు భూమి కేటాయించారు. అయితే ఎక్కువగా ప్రభుత్వ భూములను గుర్తించిన ప్రభుత్వం, అవి నివాసానికి పనికివస్తాయా రావా అని ఆలోచించలేదు. విజయవాడ రూరల్ పాతపాడు, అంబాపురం, జక్కంపూడి ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులు కొందరు మట్టి తవ్వుకుని పెద్ద పెద్ద గుంతలు తీసి పెట్టారు. అలాంటి భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడంపై లబ్దిదారులు ఆందోనకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలం మెరక వేసుకునేందుకే రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తోందన్న ఆనందం కంటే విజయవాడ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఇవ్వడంతో తాము ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని చిన్నచిన్న పనులు చేసుకుని జీవించే కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
పట్టాలు లేవు, పొజిషన్ లేదు
ఇళ్ల స్థలాల పంపిణీలో కృష్ణా జిల్లాలో వింత చోటు చేసుకుంది. ప్రభుత్వం ఎలాగూ పట్టాలు ఇవ్వడం లేదు. కనీసం పొజిషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవడంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఎలాంటి వివరాలు లేకుండా ఓ స్లిప్ చేతిలో పెట్టి పంపిస్తున్నారని, దాని ద్వారా తమకు ఏ స్థలం కేటాయించారో కూడా అర్థం కావడం లేదని లబ్దిదారులు వెంచర్ మొత్తం తిరుగుతున్నారు. అయినా వారి స్థలానికి సరైన నెంబరు కేటాయించకపోవడం, ఒక గ్రామంలో మూడు ప్రాంతాల్లో వెంచర్లు వేయడంతో కొందరు లబ్దిదారులు రోజంతా తిరిగినా వారి స్థలం గుర్తించలేకపోతున్నారు.