తెలంగాణ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,534 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,176 కు చేరాయి. తాజాగా వైరస్తో 11 మంది మృతి చెందగా, దీంతో మృతుల సంఖ్య 927కు చేరింది. ఇక వైరస్ నుంచి 24 గంటల్లో 2,071 మంది కోలుకున్నారు. మొత్తం 1,17,143 మంది బాధితులు కరోనా చికిత్సను తీసుకుని డిశ్చార్జి అయ్యారు.
మొత్తం యాక్టివ్ కేసులు 32,106…
ప్రస్తుతం రాష్ట్రంలో 32,106 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఇందులో 25,066 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. దేశంలో కరోనా మరణాల రేటు 1.68 శాతం ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో 0.61 శాతంగా ఉంది. అలాగే రికవరీ రేటు రాష్ట్రంలో 78.0 శాతం ఉండగా దేశంలో 77.83 శాతం ఉంది.
జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న ఒక్క రోజే 327 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ దాదాపు 300 నుంచి 500 వరకు కరోనా పాజిటివ్ కేసులు నగరంలో నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కొవిడ్ నిర్థారణ పరీక్షల సంఖ్య 19,53,571కి చేరింది.
ఈ నెలలో కరోనా నిజంగానే తగ్గుతుందా?
నిత్యం వేలల్లో కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవుతుంటే వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం ఈనెల చివరికల్లా రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుందని పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మీడియాతో తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఇంకా కరోనాకు వ్యాక్సినే రాలేదు అలా ఎలా కరోనా తగ్గుతుందనే అనుమానాలను, ఆశ్చర్యాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. పిహెచ్సి ల నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు కరోనాకు సంబంధించిన అన్నిరకాల మందులను, చికిత్సను అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రెమిడసవిర్, డెక్సామెథసోన్ వంటి మందులతో పేషెంట్లు త్వరగా కోలుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ రకమైన మందులను అన్ని జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు మీడియాతో తెలిపారు. దీంతో హైదరాబాద్ ఆసుపత్రులపై ప్రభావం తగ్గుముఖం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.