కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేసులో ఢిల్లీ హైకోర్టు అర్నాబ్ గోస్వామికి షాక్ ఇచ్చింది. శశి థరూర్ భార్య సునంద పుష్కర్ కొన్ని రోజుల కిందట అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. ఇది హత్యా లేక ఆత్మహత్య అనే విషయంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సమయంలోనే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పేరుతో రిపబ్లిక్ ఛానల్ ఎండీ, ఎడిటర్ అర్నాబ్ గోస్వామి వరుస కథనాలను ప్రసారం చేశారు. అర్నాబ్ గోస్వామి గురించి తెలుసుగా తనకు నచ్చిన దానిని అవతలి వారితో ఎస్ అనిపించే దాక వదలరు. సునంద పుష్కర్ కేసులో కోర్టు చెప్పకముందే అర్నాబ్ దోషి ఎవరో తేల్చేశారు. ఈ సమయంలో తన భార్యకు సంబందించిన రహస్యాలను అర్నాబ్ బయటపెట్టారని శశి థరూర్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
రిపబ్లిక్ ఛానల్ లో తనను, తన భార్యను అవమానించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని థరూర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్పీ పెంచుకునేందుకు తమ కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. థరూర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వరుస కథనాలు ప్రసారం చేస్తూ తమను అవహేళన చేస్తున్నారని కోర్టులో కూడా ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులు కేసు విచారణ సమయంలో మీడియా సంయమనం పాటించాలని కోరింది. విచారణ జరుగుతున్న సమయంలో దోషులు వారంటూ మీడియా చెప్పడమేంటని కోర్ట్ తప్పుపట్టింది. జస్టిస్ ముక్తా గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.