వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు మళ్లీ ఉక్కపోత మొదలైంది. జగన్కు సంబంధించిన అన్ని కేసుల్లో విచారణ వేగవంతమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్కు బిగ్షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా దాల్మియా సిమెంట్స్కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.793 కోట్ల విలువైన 407.05 హెక్టార్ల సున్నపురాయి గనులతో పాటు మరికొన్ని ఆస్తులను కూడా గత నెలలోనే జప్తు చేసినట్లు సమాచారం. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా నిధుల మళ్లింపునకు సంబంధించి దాల్మియా సిమెంట్స్పై 2013లోనే ఈఢీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
ఐతే ఛార్జిషీట్ను సవాల్ చేస్తూ దాల్మియా సిమెంట్స్ కోర్టుకెళ్లింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో తాజాగా దాల్మియా ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తోంది. అడ్డదారిలో సున్నపురాయి నిక్షేపాలను దాల్మియా సిమెంట్స్కు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ జగన్కు చెందిన భారతి సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు తమ వాటాలను అమ్మగా వచ్చిన డబ్బును హవాలా మార్గంలో మళ్లీ జగన్కు బదిలీ చేసిందనేది ప్రధాన అభియోగం.
అసలు కేసు నేపథ్యం ఇది –
ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఎ.చాముండేశ్వరి, ఆమె ముగ్గురు కుమార్తెలతో కలిసి ఏర్పాటు చేసిన జయా మినరల్స్ కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్పేట గ్రామాల్లో 407.05 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాల నిమిత్తం ప్రాస్పెక్టింగ్ లీజు కోసం 1997లో దరఖాస్తు చేసుకుంది. సరైన వివరాలు సమర్పించలేదని, సదరు చిరునామాలో ఆ కంపెనీ లేదని 2000 సంవత్సరం వరకు ప్రభుత్వం ఆ దరఖాస్తును పక్కన పెట్టేసేంది. ఐతే 2004లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో సజ్జల దివాకర్ రెడ్డి కుటుంబం ఆ గనుల లీజుపై కన్నేసింది.
1999లో దివాకర్రెడ్డి స్థాపించిన ఈశ్వరి సిమెంట్స్ను తెరపైకి తెచ్చి, జయా మినరల్స్ను స్వాధీనం చేసుకుంది. జయ మినరల్స్ అడిగిన సున్నపురాయి నిక్షేపాలను ఈశ్వరి సిమెంట్స్కు కేటాయించాలని సజ్జల దివాకర్రెడ్డి గనుల శాఖ డైరెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఈ దరఖాస్తును కూడా పక్కనపెట్టాలి. కానీ జయ మినరల్స్ను ఈశ్వరి సిమెంట్స్ చేజిక్కించుకోగానే తప్పులన్నీ ఒప్పయ్యాయి. సున్నపురాయి నిక్షేపాలను తమకు కేటాయించాలన్న ఆ దస్త్రాన్ని సర్క్యులేట్ చేయాలని అప్పటి గనులశాఖ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్ తమ సిబ్బందిని ఆదేశించారు. కొద్దిరోజుల్లోనే సున్నపురాయి నిక్షేపాల లీజు ఈశ్వరి సిమెంట్స్కు దక్కింది.
క్విడ్ ప్రోకో ఎలా జరిగిందంటే –
అనంతరం ఈ లీజును దాల్మియా సిమెంట్స్కు బదలాయించేలా ఆ కంపెనీ తరఫున పునీత్ దాల్మియా, దివాకర్రెడ్డిల మధ్య 2006 ఏప్రిల్ 12న ఒప్పందం కుదిరింది. ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్కు చెందిన భారతి సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టింది. ఒక్కో షేరుకు అప్పట్లోనే రికార్డు స్థాయిలో రూ.1,440 చెల్లించింది. అనంతరం ఆ వాటాలను ఫ్రెంచి సంస్థకు విక్రయించింది. ఇందుకుగాను దాల్మియా సిమెంట్స్కు రూ.146.58 కోట్లు రాగా వాటిలో పెట్టుబడుల లాభం పోను రూ.139 కోట్లు మిగిలింది. ఈ డబ్బును హవాలా మార్గంలో జగన్మోహన్రెడ్డికి బదిలీ చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడయింది. దాల్మియా సిమెంట్స్ ఉద్యోగి జయ్దీప్ బసు నుంచి ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న పెన్డ్రైవ్ను విశ్లేషించినప్పుడు JR ఖాతాలోకి రూ.55 కోట్లు చెల్లించినట్లుగా ఉంది.
ఇక్కడ JR అంటే జగన్ మోహన్ రెడ్డి అని దర్యాప్తు సంస్థలు భావించాయి. మొత్తం దాల్మియా సిమెంట్స్కు వచ్చిన రూ.139 కోట్లలో రూ.55 కోట్లు హవాలా మార్గంలో JR ఖాతాలోకి పంపగా మిగతా డబ్బు కూడా మళ్లించేలోపే CBI దర్యాప్తు మొదలవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. సున్నపురాయి గనుల కేటాయింపు, భారతి సిమెంట్స్లో దాల్మియా పెట్టుబడి పెట్టడం, తమ వాటా అమ్మగా వచ్చిన డబ్బును హవాలా ద్వారా మళ్లించడం వంటివన్నీ నిధుల మళ్లింపు కిందికే వస్తాయన్న అభియోగంపై దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఈడీ తాజాగా జప్తు చేసింది.