అనుకున్నదంతా జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితం వెలువడటం.. అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఘన విజయాన్ని సాధించారు. పదహారు నెలలు మాత్రమే పదవీ కాలం ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు గెలుపు అవసరమైన దరిమిలా.. కవితమ్మ ఊపిరి పీల్చుకోవటానికి.. కొత్త ఉత్సాహంతో భవిష్యత్ వ్యూహాలకు అవసరమైన శక్తి సామర్థ్యాల్ని తాజా పదవి ఇస్తుందని చెప్పాలి. పోలింగ్ కు ముందే ఆమె విజయం ఖరారైనా.. పోలింగ్ తర్వాత మాత్రం ఆమెకు ఘన విజయం తప్పదని.. పోటీలో ఉన్న రెండు పార్టీలకు డిపాజిట్లు గల్లంతు అవుతాయన్న అంచనాలు వెలువడ్డాయి. అందుకు తగ్గట్లే తాజా ఫలితాలు రావటం గమనార్హం.
తాజా ఫలితాలు టీఆర్ఎస్ కు పెద్ద సంతోషాన్ని ఇచ్చేవేమీ కావు. అయినప్పటికీ గెలుపును మరింత పెద్దది చేసుకొని చూపించుకోవటం ద్వారా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను వ్యాపింప చేసే ప్రయత్నంలో ఉన్నారు. కవిత గెలుపుతో.. రాష్ట్ర సర్కారులో మరో అప్రకటిత అధికార కేంద్రం షురూ అయినట్లే. ఈ విషయం అలా ఉంచితే.. తాజా ఎన్నికల గెలుపు ఏం చెప్పింది? ఎలాంటి సంకేతాల్ని ఇచ్చింది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా ఉప ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో కూసింత మార్పునకు అవకాశం ఉందని చెప్పక తప్పదు.
సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్లు..
తాజాగా వెల్లడైన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ కు పెద్ద షాక్ గా మారింది. రాష్ట్రంలో అధికారపక్షానికి సరైన ప్రత్యర్థి తామేనని జబ్బలు చరుచుకునే ఆ పార్టీకి ఇప్పుడు మాటల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. ఆ పార్టీకి రావాల్సిన ఓట్ల కంటే దారుణంగా ఓట్లు రావటం ఒకటైతే.. బీజేపీ కంటే తక్కువ ఓట్లు పడటం..ఆ పార్టీకి అంతకు మించిన అవమానం మరొకటి ఉండదని చెప్పక తప్పదు. మొత్తం 823 ఓట్లలో కవితకు 728 ఓట్లు వచ్చాయి. మిగిలిన ఓట్లలో పది ఓట్లు చెల్లుబాటు కాలేదు. బీజేపీకి 56 ఓట్లు వస్తే.. కాంగ్రెస్ కు కేవలం 29 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓటమి పరంగా చూస్తే.. బరిలో నిలిచిన కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. అయితే.. బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉండగా.. కాంగ్రెస్ పరిస్థితి దీనాతిదీనంగా మారింది.
ఆకాశం నుంచి పాతాళానికి ప్రయాణం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేని రీతిలో ఉండేది. అలాంటి పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వటం ద్వారా కొత్త రాష్ట్రంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తానని భావించింది. అందుకు భిన్నంగా ఆ పార్టీ వరుసగా రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైతే.. పార్టీ నేతల జంపింగ్స్ తో ఇప్పుడు ఉనికి సైతం ప్రమాదంలో పడిన పరిస్థితి. ఒకప్పుడు బలంలో తనకు సాటి వచ్చే వారే లేరన్న స్థానం నుంచి ఇప్పుడు తనకున్న బలం ఏమిటో చెప్పటానికి సైతం నేతల్ని వెతుక్కోవాల్సిన దుస్థితి.
నెలల ముందే జంపింగ్స్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మొత్తం 148 ఓట్ల బలం ఉంది. ఈ ఓటు బ్యాంకును చీల్చేందుకు కొన్ని నెలలుగా తెలంగాణ అధికారపక్షం పావులు కదపటంతో చాలామంది నేతలు పార్టీ మారిపోయారు. దీంతో.. తాజాగా దారుణ పరాజయం తప్పలేదు. ముందు నుంచే కాంగ్రెస్ ను దెబ్బ తీయటానికి గులాబీ నేతలు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయటంతో ఆ పార్టీకి రావాల్సిన ఓట్లలో 20 శాతం ఓట్లు కూడా రాలేదంటే అంతకు మించిన ఇబ్బంది ఇంకేం ఉంటుంది. జంపింగ్స్ తో కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ తీయటంలో తెలంగాణ అధికారపక్షం విజయం సాధించింది.
ఓటమిలోనూ గెలుపు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది టీఆర్ఎస్ పార్టీ అయినా.. ఓడి గెలిచిన క్రెడిట్ మాత్రం బీజేపీకి దక్కిందని చెప్పాలి. తెలంగాణ అధికారపక్షంతో పోటీ పడగలిగే సత్తా తమకు మాత్రమే ఉందని ఇటీవలి కాలంలో కమలనాథులు అదే పనిగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. తాజా ఫలితం వచ్చింది. దీంతో.. కమలనాథులు వినిపిస్తున్న వాదనలో నిజముందన్న అభిప్రాయం కలుగక మానదు. కాంగ్రెస్ కు ఉన్న 148 ఓట్లలో 118 ఓట్లు పోగొట్టుకుంటే.. బీజేపీ మాత్రం తమకున్న 78 ఓట్లలో 24 ఓట్లను మాత్రమే కోల్పోవటంతో ఆ పార్టీ కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లను నమోదు చేసుకోగలిగింది. దీంతో కాంగ్రెస్ కంటే తామే మెరుగ్గా ఉన్నమన్న సంకేతాల్ని ఇవ్వటంలో వారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. కవిత గెలుపు- కాంగ్రెస్ కు కొత్త కష్టాన్ని తీసుకొస్తే.. కమలనాథులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు.