మిశ్రా రిపోర్ట్ ఏదీ..?
11వ పీఆర్సీ ఛైర్మన్ అశుతోష్ మిశ్రా కమిటీ ఏపీలోని 13 జిల్లాలను తిరిగి.. ఉద్యోగ సంఘాలన్నింటిని కలిసి సమస్యలను తెలుసు కుంది. దీనిపై ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. ఉద్యోగులు 11వ పీఆర్సీకి సంబంధించి అనేక అంశాలను, ఉద్యోగల సమస్యలను అందులో క్రోడీకరించి, జగన్ రెడ్డి ప్రభుత్వానికి అందజేసింది. అయితే ఆ రిపోర్ట్ ఆధారంగా పీఆర్సీ, ఇతర బెనిఫిట్స్ తమకు అందజేయకుండా మోసం చేస్తుందని ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు మేలు చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తే.. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు రిపోర్ట్ ను బయటపెట్టి, దాని ఆధారంగా పీఆర్సీని ప్రకటించవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు. రెండుగా ఉద్యోగ సంఘాలను చీల్చి.. విభజించు – పాలించు అన్న ధ్రోరణిలో సమ్మె పై నీళ్లు చల్లారు. దీనిని ఎంత మేరకు సహించేది లేదని ఏపీ ఉపాధ్యాయ సంఘం ఫ్యాప్టో, మరికొంతమంది ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది సోమవారం నుంచి ఆందోళ బాట పట్టారు.
27 శాతం కన్నా ఎక్కువ పీఆర్సీ కావాలి..
ఏపీ ప్రభుత్వంతో శనివారం అర్థరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. 23 శాతం పీఆర్సీని ఒప్పుకుని, నిబంధనలతో కూడిన హెచ్ఆర్ఏని అంగీకరించారు స్టీరింగ్ కమిటీ సభ్యులు. అయితే దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 11వ పీఆర్సీ జీవోలను రద్దు చేసి, అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఫిట్మెంట్ పెంపుదల చర్చకు అనుమతివ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. చర్చల్లో ఉపాధ్యాయులకు, సీపీఎస్ సమస్యలు, కాంట్రాక్టు, ఔట్ సోర్స్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన లేదని మండిపడ్డారు. పీఆర్సీలో 27 శాతం కంటే ఎక్కువగ ఫిట్మెంట్ సాధనకు, సీపీఎస్ రద్దుకోసం, ఇతర సమస్యల పరిష్కారానికి దశలవారి పోరాటాలకు ఫ్యాప్టో పిలుపునిచ్చింది. సోమవారం నుంచి నల్ల బ్యాడ్జిలతో విధులు హాజరు, 11న 13 జిల్లాల కలెక్టర్ లకు వినతి ప్రతాల సమర్పణ, 12న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం వంటివి నిర్వహిస్తున్నట్లు ఫ్యాప్టో కమిటీ ప్రతినిధులు తెలిపారు.