ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కరణం బలరాం చెరగని ముద్ర వేశారు. ఆయన రాజకీయాలకు అద్దంకి నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో నాలుగు దశాబ్ధాల పాటు కరణం బలరాం అద్దంకి నుంచి పలు పర్యాయాలు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా అద్దంకి సీటును తెలుగుదేశం అధిష్టానం గొట్టిపాటి రవికుమార్కు కేటాయించింది. కరణం బలరాంను చీరాలకు పంపించారు. చీరాలకు కరణం బలరాం కొత్తే అయినా అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన కృష్ణ మోహన్పై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో కరణం బలరాం భారీ మెజారిటీతో గెలిచారు. తనయుడి రాజకీయ భవిష్యత్తుపై ప్రస్తుతం కరణం బలరాం దృష్టి సారించారని తెలుస్తోంది. దీంతో పోయిన చోటే వెతుక్కోవాలని అద్దంకిలో వచ్చే ఎన్నికల నాటికి పాగా వేయాలని కరణ బలరాం తనయుడు వెంకటేష్ తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు.
భారీ ఫ్లెక్సీలతో చెప్పకనే చెబుతున్న వెంకటేష్
కరణం బలరాం కుటుంబానికి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో ఒక సీటు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చీరాల వైసీపీ అభ్యర్థిగా వ్యవహరిస్తున్న బలరాంకు మరలా అక్కడ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదట. వచ్చే ఎన్నికల నాటికి బలరాం రాజకీయాల నుంచి తప్పుకుని కుమారుడు వెంకటేష్కు లైన్ క్లియర్ చేయాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే అద్దంకిలో కరణం వెంకటేష్ జన్మదినం సందర్భంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారట. గత ఎన్నికల్లో అద్దంకిలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్య అక్కడ వైసీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అద్దంకి ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన అభిమానులు కూడా అద్దంకిలో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. రెండు వర్గాలు ఫ్లెక్సీల యుద్ధం ప్రారంభించడంతో రాత్రికి రాత్రి అనుమతులు లేవంటూ పోలీసులు వాటిని తొలగించారు. దీంతో అద్దంకిలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక భారీగా పోలీసులను మోహరించారు.
నెగ్గే దెవరో..
అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాంకు మంచి పట్టుంది. తనయుడు వెంకటేష్ కూడా అందరికీ అందుబాటులో ఉంటూ స్థానికంగా బలం పెంచుకున్నారు. అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలచిన గొట్టిపాటి రవికుమార్ 2018లో టీడీపీలో చేరడంతో కరణం బలరాంకు కష్టాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధినేత ఇచ్చిన హామీ మేరకు 2019 ఎన్నికల్లో అద్దంకి సీటును గొట్టిపాటి రవికుమార్కు కేటాయించారు. దీంతో అద్దంకిలో కరణం బలరాంకు మొదటిసారి సీటు దక్కకుండా పోయింది. చివరి క్షణంలో చీరాల సీటు కేటాయించడంతో చేసేది లేక అక్కడ నుంచే పోటీ చేసి విజయం సాధించారు. చీరాలకు బలరాం నాన్ లోకల్ కావడంతో వైసీపీలో ఓడిన నేత కృష్ణ మోహన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే పెద్దలు అంటూ ఉంటారు..ఈ ఊరి కరణం పొరుగూరులో వెట్టివాడితో సమానమని. కరణం బలరాం పరిస్థితి కూడా చీరాలలో ఇలాగే తయారైంది. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా అద్దంకి నుంచి తనయుడు వెంకటేష్ను పోటీ చేయించాలని బలరాం గట్టి పట్టుదలతో ఉన్నారట. అందుకే అద్దంకిని మాత్రం వదిలేదని లేదని జన్మదిన శుభాకాంక్షల ఫ్లెక్సీల ద్వారా తండ్రీ, కొడుకులు చెప్పకనే చెబుతున్నారని మరోసారి రుజువైంది.
గొట్టిపాటిని ఓడించడమే వెంకటేష్ లక్ష్యమా..
అద్దంకిలో గొట్టిపాటి కుటుంబానికి, కరణం బలరాం కుటుంబానికి నాలుగు దశాబ్ధాల వైరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు కుటుంబాలు ఒక పార్టీలో ఉండటం జరగదు. కానీ 2019 ఎన్నికల్లో ఇద్దరూ ఒకే పార్టీ నుంచి రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 2014లో గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నుంచి పోటీచేసి అప్పటి టీడీపీ అభ్యర్ధి కరణం వెంకటేష్ను ఓడించారు. దీంతో మరింత కసి పెంచుకున్న వెంకటేష్ ఎలాగైనా అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ను ఓడిస్తానని శపథం చేశారట. అందులో భాగంగానే అద్దంకిలో పట్టుకోసం అలుపెరగని పోరాటం సాగిస్తున్నారని తెలుస్తోంది.