Four IAS Officers Attend AP High Court :
ఏపీ సీఎంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్ది పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అధికారులు.. ప్రత్యేకించి విధాన పరమైన నిర్ణయాల అమలులో కీలక భూమిక పోషించే ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారనే చెప్పాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేయాలి.. సమాంతరంగా హైకోర్టు, కింది కోర్టులు జారీ చేసే ఆదేశాలను అమలు చేయాలి.. ఈ రెండింటిలో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాలనలో అసలు కోర్టు ముఖం చూసిన అధికారులే లేరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే.. అప్పుడు కోర్టులు చెప్పే మాటలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదు. కోర్టులు ఆదేశాలు ఇస్తూనే ఉంటాయి.. మనం చేసేది మనం చేసుకుంటూ పోవాలి అన్న రీతిలో వైసీపీ సర్కారు పెద్దలు సాగుతున్నారు. వెరసి కోర్టు ధిక్కరణ కేసులు ఐఏఎస్ అధికారులపై నమోదవుతున్నాయి. ఇలా నమోదైన ఓ కోర్టు ధిక్కరణ కేసులో సోమవారం హైకోర్టు విచారణకు ఏకంగా నలుగురు ఐఏఎస్ అధికారులు హాజరైన వైనం కలకలం రేపుతోంది.
కొత్తగా విజయ్ కుమార్
ఈ కేసులో హైకోర్టుకు వచ్చిన వారిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మిలతో పాటు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఉన్నారు. ఈ నలుగురిలో శ్రీలక్ష్మికి కోర్టులు, కేసులు బాగానే అలవాటు. దివంగత సీఎం వైఎస్సార్ జమానాలో రాజకీయ నేతలు చెప్పినట్లు నడుచుకుని, నిబంధనలకు నీళ్లొదిలిన ఈమె చాలా కాలం పాటు జైల్లోనే ఉన్నారు. ఐఏఎస్ టాపర్ గా నిలిచిన ఆమెను వైఎస్సార్ జమానా జీరోను చేసేసిందనే చెప్పాలి. అంతేకాకుండా ఆరోగ్యపరంగానూ శ్రీలక్ష్మి చాలా దెబ్బ తిన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు విచారణలు ఆమెకు కొత్త కాదు. ఇక ద్వివేదీ, శంకర్ లకు కూడా కోర్టు కేసులు, శిక్షలు కొత్త కాదు. ఇటీవలే కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్షకు గురైన వీరిద్దరూ.. కోర్టు హాలులో ఓ రోజంతా కూర్చుని ఆ శిక్ష నుంచి తప్పించుకున్నారు. అయితే గియితే.. ఇప్పుడు కోర్టుకు వచ్చిన అనుభవం విజయ్ కుమార్ కు కొత్తే. జగన్ సీఎం అయిన దగ్గరి నుంచి జగన్ నామ స్మరణలో తరిస్తున్న విజయ్ కుమార్ చాలా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రీలక్ష్మి రాక ముందు మునిసిపల్ శాఖ వ్యవహారాలు కూడా ఆయనే చూసేవారు. మొత్తంగా సోమవారం నాడు కోర్టుకు నలుగురు హాజరైతే.. వారిలో విజయ్ కుమార్ కు మాత్రం కొత్త అనుభవమేనని చెప్పాలి.
కోర్టు ధిక్కరణ ఏమిటంటే..?
ప్రభుత్వ పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు నిర్మించవద్దంటూ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను అంతగా పట్టించుకోని పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖలు స్కూళ్లలో సదరు కార్యాలయాల భవనాలు ఏర్పాటు అవుతున్నా చోద్యం చూస్తూ కూర్చుంది. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు కాగా.. ఈ కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ చేపట్టారు. ఈ విచారణకు నలుగురు ఐఏఎస్ అధికారులు హాజరు కాగా.. జస్టిస్ దేవానంద్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పేద పిల్లలు చదవుకునే స్కూళ్ల వాతావరణాన్ని ఎలా కలుషితం చేస్తారు? పాఠశాలల్లోకి రాజకీయాలను ఎలా చొప్పిస్తారు? మీలో ఎవరైనా ఈ పాఠశాలల్లో చదువుకున్నారా? అని తలంటారు. అంతేకాకుండా దీనిపై సమగ్ర వివరాలను, కోర్టు ఆదేశాలు ధిక్కరించిన వారిపై ఏ చర్యలు తీసుకున్నారో వివరించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆగస్టు 31న జరిగే తదుపరి విచారణకు కూడా నలుగురూ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.
Must Read ;- జగన్ వ్యవస్థ అట్టర్ ఫ్లాప్