అమిత్ షా ఏమో కేంద్ర హోం శాఖ మంత్రి. ప్రజా గాయకుడు గద్దరేమో విప్లవ గీతాల రచయిత. వీరిద్దరి మధ్య భేటీ దాదాపుగా సాధ్యం కాదనే చెప్పాలి. అయితే ఇవేవీ పట్టించుకోని గద్దర్.. తనకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పించాలంటూ తెలంగాణకు చెందిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తలుపు తట్టారు. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా అమిత్ షా పెద్దగా అపాయింట్ మెంట్లే ఇవ్వడం లేదు. ఏపీ సీఎం జగన్ ను అయితే అమిత్ షా ఓ రేంజిలో సతాయిస్తున్నారు. జగన్ నాలుగైదు సార్లు ఢిల్లీకి వస్తే.. ఒక్కసారి కనికరిస్తూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో గద్దర్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పించడం అంటే మాటలు కాదు కదా. ఈ విషయంలో గద్దర్ కోరిక మేరకు కిషన్ రెడ్డి హోం మినిస్టర్ తలుపు తట్టినా.. అమిత్ షా కనికరిస్తారా? అన్న దిశగా ఆసక్తికర చర్చ సాగుతోంది.
షాతో ఏం మాట్లాడతారంటే?
అమిత్ షా అపాయింట్ మెంట్ కోరిన గద్దర్.. తనకు అపాయింట్ మెంట్ దొరికితే కేంద్ర హోం మంత్రితో ఏం మాట్లాడతానన్న విషయాన్ని మాత్రం ముందే వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి ముందు నక్సల్స్ తో కలిసి సాగిన గద్దర్.. నక్సల్ బరి ఉద్యమాన్ని ఉర్రూతలూగించేలా పాటలు రాసి.. కాలికి గజ్జె కట్టి మరీ ఆలపించి జనం గుండెల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఏవైనా ప్రజా ఉద్యమాలు జరిగితే.. గద్దర్ అక్కడ ప్రత్యక్షమైపోతారు. ఇలాంటి తరుణంలో మావోయిస్టులతో సంబంధాలు నెరపుతున్నట్లుగా గద్దర్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్ని ఇప్పటికీ విచారణ దశలోనే ఉన్నాయి. వాటి విచారణ, దర్యాప్తులు గద్దర్ కు ప్రాణసంకటంగానే మారిపోయాయి. అమిత్ షాతో భేటీకి అవకాశం దొరికితే.. తనపై ఉన్న కేసులను కొట్టేయాలని కోరతానని, అందుకోసమే అమిత్ షా అపాయింట్ మెంట్ కోరానని గద్దర్ చెబుతున్నారు. మరి గద్దర్ వినతిని కిషన్ రెడ్డి హోం మంత్రి దృష్టికి తీసుకెళతారా?, ఒకవేళ కిషన్ రెడ్డి తీసుకెళ్లినా అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
వెన్నులోని బుల్లెట్ ఇంకా అక్కడే..
కిషన్ రెడ్డిని కలిసిన సందర్భంగా గద్దర్ తన దయనీయ పరిస్థితిని ఆవిష్కరించారు. ప్రభుత్వం పిలుపు మేరకు 1990లో నక్సలిజాన్ని వదిలి తాను జనజీవన స్రవంతిలో కలిశానని గద్దర్ తెలిపారు. 1997 ఏప్రిల్ 6న తనపై హత్యాయత్నం జరిగిందని, వెన్నుపూస దగ్గర ఓ బుల్లెట్ ఇప్పటికీ అలాగే ఉండిపోయిందని తెలిపారు. ఆ బుల్లెట్ అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్నుంచి తాను డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటున్నానని, అలాంటిది తాను పరారీలో ఉన్నానని ప్రచారం చేయడం తగదని గద్దర్ వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తనపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి న్యాయ సహాయం అందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని గద్దర్ గతంలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ సర్కారు నుంచి గద్దర్ కు సానుకూల స్పందన రాలేదు. ఈ కారణంగానే ఆయన అమిత్ షాను కలవాలని భావిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
Must Read ;- ఒకే రోజు 500 కోట్లు, ఓ చైర్మన్ గిరీ