విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ను తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులతో కలిసి ఓ బృందంగా విశాఖకు వస్తామని కేటీఆర్ చెప్పినట్లు గంటా పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు గంటా అందరి మద్దతును కూడగడుతున్నారు.
Must Read ;- ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దికోసమే ఉక్కుకు కేటీఆర్ మద్దతు డ్రామా : రేవంత్