సూపర్ స్టార్ మహేశ్ బాబు 28వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న SSMB28గా పిలుచుకుంటున్న మూవీ పై ఆయన అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా మంచి సక్సెస్ సాధించడంతో వీరి కలయికలో రాబోతున్న చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి.ఈ మూవీ ప్రకటన వెలువడిన నాటి నుంచి అనేక వార్తలు వినిపించగా అన్నీ సెన్సేషనల్ గా మారుతున్నాయి.
మొన్నామధ్య ఈ సినిమా కోసం అర్జునుడు అనే పవర్ ఫుల్ టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు ఇదివరకు వార్తలొచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేసింది. ఈ చిత్రంలో మహేష్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించబోతోంది. ఈ విషయాన్ని సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ‘మహర్షి’ చిత్రంలో మొదటి సారిగా పూజా, మహేశ్ సరసన కథానాయికగా నటించింది. కాగా , ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో పూజా ఈ సినిమాకి పాజిటివ్ సెంటిమెంట్గా మారిందట.అందుకే దర్శక, నిర్మాతలు ఈ మూవీకి పూజాని ఓకే చేశారని టాక్.
ఇదిలా ఉంటే ఈ చిత్రం పై తాజాగా మరో వార్తా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మికను ఫైనల్ చేశారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రష్మికా, మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్టవడంతో ఆమె విషయంలో మహేశ్ బాబుకు పాజిటివ్ సెంటిమెంట్ ఉందని..అందుకే రష్మిక పేరు తెర పైకి వచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే ఈ ప్రచారం పై సినీ పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్కు ఆల్రెడీ పూజా సెంటిమెంట్ ఉందని..ఈ నేపధ్యంలో ఆమెను ఈ సినిమా నుంచి తప్పించడం జరగనిపని అని అభిప్రాయాడుతున్నారు. అదేసమయంలో రష్మికా ను మరో కథానాయికగా ఎంపిక చేయి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే SSMB 28లో రష్మిక మందణ్ణ మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతోందా, రెండో హీరోయిన్ గా నటిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , సితారా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతుండగా.. వచ్చేనెల్లో సెట్స్ పైకి వెళ్లబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, చిత్రం లో హీరోయిన్ ఎవరనే అంశం పై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే అలరించబోతోందా ? లేక రష్మికా కనిపించబోతోందా ? అసలు ఈ వార్తల్లో నిజానిజాలేంటన్నది మాత్రం వేచి చూడాలి.