ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతిని భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, ఒకేసారి 15 ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది. సీఆర్డీఏ కార్యాలయం సమీపంలో జరగనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొంటారు
ఈ 15 సంస్థలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి కీలకమైన జాతీయ బ్యాంకులు, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) వంటి ఆర్థిక సంస్థలు ఉన్నాయి. ఈ కార్యాలయాల ఏర్పాటు ద్వారా అమరావతికి రూ. 1,328 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని, తద్వారా సుమారు 6,514 మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది రాజధాని ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు –
ఈ కార్యాలయాలు ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి తదితర ప్రాంతాల పరిధిలో ఏర్పాటు కానున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో భాగం. కార్యాలయాల భవనాలు, ఉద్యోగుల నివాస వసతుల కోసం సీఆర్డీఏ ఇప్పటికే 27 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించింది. బ్యాంకులు, బీమా సంస్థలు సహా ఇన్కమ్ ట్యాక్స్ వంటి ప్రభుత్వ అనుబంధ కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పాటు కానుండడంతో, అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది
ఒకే వేదికపై ఇన్ని కీలక ఆర్థిక సంస్థల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం అనేది ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా అమరావతి అభివృద్ధిలో కీలకం కానుంది. రాష్ట్ర విభజన తర్వాత తాత్కాలిక ఆఫీసుల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థలకు శాశ్వత చిరునామా దొరకనుంది. ఇది రాజధాని నిర్మాణం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేయడంతో పాటు, రాబోయే రోజుల్లో అమరావతి మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేందుకు మార్గం సుగమం చేయనుంది











