తెలంగాణలో అన్ని వర్గాలకూ అమితాసక్తి రేకెత్తిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైపోయిందనే చెప్పాలి. కరోనా నేపథ్యంలో ఇప్పుడప్పుడే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగదులే అన్న భావనలను తోసిరాజంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికిప్పుడే ఉప ఎన్నికకు రంగం సిద్ధం చేసినట్టుగా స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు అటు విపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఒక్కసారిగా కార్యక్రమాల వేగం పుంజుకోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికను కేంద్రంగా చేసుకుని సీఎం కేసీఆర్ తన పర్యటనల్లో నిన్నటిదాకా ఓ రకమైన స్పీడును కనబరిస్తే.. బుధవారం నుంచి ఆ స్పీడు జెట్ స్పీడుగా మారిపోయింది. మరోవైపు పాదయాత్రలో ఉన్న ఈటల రాజేందర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నా. తక్షణమే తన యాత్రను పునఃప్రారంభిస్తున్నట్లుగా బుధవారమే ప్రకటించారు. ఇక వారిద్దరి కంటే ముందుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లక్షమందితో బహిరంగ సభ అంటూ మంగళవారమే సంచలన ప్రకటన చేశారు. ఈ ముగ్గురు నేతల స్పీడు చూస్తుంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వాసాలమర్రి నుంచి దళిత బంధు షురూ
హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రకటించిన దళిత బంధుకు గురువారమే టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. వాస్తవానికి ఈ పథకానికి సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా పరిగణిస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. అయితే బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని తన దత్తత గ్రామం వాసాలమర్రికి వెళ్లిన కేసీఆర్.. ఆ గ్రామంలోని దళితులతోనే దళిత బంధును ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. గ్రామంలోని 76 దళిత కుటుంబాలను ఈ పథకానికి ఎంపిక చేశామని, గురువారం నాడే వారి ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేయనున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనను బట్టి చూస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం చేసిందన్న సమాచారంతోనే కేసీఆర్ ఈ మేరకు పథకం అమలుపై తన వైఖరిని మార్చుకున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాకుండా హుజూరాబాద్ లోనే ఈ పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనన్న వాదనలను కొట్టిపారేసేందుకు కేసీఆర్ ఈ కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆసుపత్రి నుంచి నేరుగా పాదయాత్రకు..
ఇక మంత్రివర్గం నుంచి బర్తరఫ్ నకు గురైన ఈటల రాజేందర్.. ఆ తర్వాత టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ కారణంగానే హుజూరాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యమైందని చెప్పాలి. ఈ క్రమంలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండానే పాదయాత్ర మొదలెట్టేసిన ఈటల.. ఇటీవలే అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం నాడు బీజేపీ అధిష్ఠానం నుంచి అందిన సమాచారం మేరకు తాను గురువారం నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నట్లుగా ఈటల ప్రకటించారు. అంతేకాకుండా ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లకుండానే నేరుగా పాదయాత్రకు వెళ్లనున్నట్లుగా కూడా ఈటల ప్రకటించిన వైనం ఉప ఎన్నికకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ వెలువడే సంకేతాలు వెలువడినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి
రేవంత్ జోరుకూ ఇదే కారణమా?
ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఓ రకమైన నయా జోష్ ను నింపిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హుజూరాబాద్ ఉప ఎన్నికపై చర్చించేందుకు నిన్న పార్టీకి చెందిన కీలక నేతలతో గాంధీ భవన్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రేవంత్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ నెల 11 నుంచి 21 వరకు హుజూరాబాద్ లో పార్టీ సమావేశాలు నిర్వహించాలని కూడా రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా మండలాల్లో జరిగే సమావేశాలకు మొత్తం ఓటర్లలో 10 శాతం మంది హాజరయ్యేలా వ్యూహం రచించాలని సూచించారు. ఈ నెల 9 నుంచి 17 వరకు దళిత-గిరిజన దండోరాను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని కూడా రేవంత్ చెప్పారు. మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశాలున్నాయన్న కోణంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికను టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లకు అప్పగించినట్లుగా కూడా రేవంత్ ప్రకటించారు.
Must Read ;-