కొవిడ్ 19 నియంత్రణలో భాగంగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు సంబంధించి మూడో దశ క్లినికల్ ట్రయల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు భారత్ బయోటెక్ కంపెనీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని భారత ఔషద నియంత్రణ సంస్థ – డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)కి చెందిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (SEC)కి సమర్పించింది. అయితే ఈ నివేదికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నిపుణుల కమిటీ ఈ రోజు భేటీ కానున్నట్లు సమాచారం.
అత్యవసర వినియోగానికి ఆమోదం
కాగా 5 నెలల క్రితం అత్యవసర వినియోగానికి అధికారిక ఆమోదం పొందిన భారత్ బయోటెక్ ఇప్పటికే మూడో దశ ట్రయల్స్కు సంబంధించి రెండుసార్లు మధ్యంతర పరీక్షా ఫలితాలను వెల్లడించింది. తొలి మధ్యంతర పరీక్షల ఫలితాల్లో 81శాతం, రెండో మధ్యంతర ట్రయల్స్ ప్రకారం 78 శాతం ప్రభావం ఉందని ఇప్పటికే వెల్లడిండింది. తాజా నివేదిక ప్రకారం 77.8శాతం ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. కొవిడ్ 19ను అడ్డుకోవడంలో కోవాగ్జిన్ 81 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని భారత్ బయోటెక్ ఈ ఏడాది మార్చిలో అధికారికంగా ప్రకటించింది. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన కొవాగ్జిన్ మాస్టర్ డేటా ప్రాథమిక అంశాలను ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ బయోటెక్ సమర్పించిన ట్రయల్స్ డేటాను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) ఈ వ్యాక్సిన్ పనితీరు ఎంతనేది అధికారికంగా వెల్లడించనుంది. సోమ, మంగళవారాల్లో భారత్ బయోటెక్ ప్రతినిధులు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI)కి చెందిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (SEC)కి తమ క్లినికల్ ట్రయల్స్ డేటాతో కూడిన ప్రజెంటేషన్ ఇచ్చారు. 680 మందిపై జరిగిన ప్రయోగాల వివరాలను అందించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ( WHO) ఆమోదిస్తే..
కాగా జూన్ 23న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కొత్త వ్యాక్సిన్లకు కొవిడ్-19 నియంత్రణ వ్యాక్సిన్ల జాబితాలో చేర్చే అంశంపై సమావేశం కానున్నారు. కోవాగ్జిన్ ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇవ్వని నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రయల్ డేటాలో ప్రమాణాలను పరిశీలించాక అనుమతి ఇవ్వనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస ఆమోదం కూడా లభిస్తే భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొవాగ్జిన్ టీకాను వేసుకున్న భారతీయ పౌరులు అంతర్జాతీయ ప్రయాణాలు చేయడం కూడా మరింత సులువు అవుతుంది. ప్రస్తుతం మన దేశంలో కొవాగ్జిన్తో పాటు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారు చేసిన భారత్కు అనుగుణంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన కొవిషీల్డ్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఇటీవలే టాస్క్ ఫోర్స్ ప్రకటన..
భారత్ బయోటెక్ కొవాగ్జిన్కి సంబంధించిన మూడో దశ ట్రయల్స్ డేటా వారం రోజుల్లో తమకు రానుందని జూన్ 12న నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతినిధి వీకే పాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Must Read ;- రెండు డోసుల మధ్య వ్యవధి ఎంత.. వ్యాక్సిన్ల విరామంపై మరోసారి వివాదం