ఏదీ ఊరకనే జరగదని చెబుతారు. వార్తల రూపంలో కనిపించే చాలా వాటి వెనుక ఎంతో కసరత్తు ఉంటుంది. ఆ తర్వాతే అది వార్త రూపంలో ప్రపంచానికి పరిచయమవుతుంది. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ పరిణామాలు.. సంచలనాలు ఉత్తినే జరిగిపోవు. పక్కా ప్లానింగ్ తో జరుగుతుంటాయి. శనివారం రాత్రి వేళలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజేయ్ కల్లం ప్రెస్ మీట్ పెట్టి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణల గురించి వివరంగా వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదు నకలును మీడియాకు అందించారు. అజేయ్ కల్లం సారు చెప్పిన దాని ప్రకారం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ తర్వాత రెండు రోజులకు తాము ఆ విషయాన్ని బయటపెడుతున్నట్లుగా చెప్పారు.
సుప్రీంకోర్టులో అత్యుత్తమ స్థానంలో ఉన్న న్యాయమూర్తి మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు పెను సంచలనంగా మారాయి. దీనికి వెనుక లక్ష్యాలు చాలామందికి ఇట్టే అర్థమైనట్లు కనిపిస్తాయి కానీ.. ఆ లోతులు లెక్క చాలానే ఉందంటున్నారు. ఎప్పటిలానే జగన్ ను అభిమానించే వారు ఒకలా.. ఆయన్ను వ్యతిరేకించేవారు మరోలా ఈ ఉదంతంపై రియాక్టు అయ్యారు. కానీ.. విషయాన్ని విషయంగా చెప్పే ప్రయత్నాన్ని అందరూ మిస్ అయ్యారు. విషయం ఏదైనా.. వంగిపోవటం ఒక అలవాటుగా మారిన వేళ.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అంత సులువైన విషయం కాదు.
లేఖలోని అంశాల గురించి చాలామంది ఇప్పటికే చెప్పటం జరిగింది. లేఖతో సీఎం జగన్ ఇమేజ్ ఆకాశానికి తాకినట్లుగా పేర్కొంటూ సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో చాలానే పోస్టులు వైరల్ అయ్యాయి. వాటిల్లోని అంశాల్ని పక్కన పెడితే.. ఈ లేఖ ద్వారా జగన్ లక్ష్యాలు ఏమిటన్న విషయాన్ని ప్రస్తావించే విషయాన్నిచాలామంది మర్చిపోయారు. ఏది ఉత్తనే జరగదు. నిజానికి శనివారం రాత్రి తర్వాతే లేఖను విడుదల చేసే బదులు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిన రోజే.. ఎందుకు పంపనట్లు? అన్నది అసలు ప్రశ్న.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ భూములు ఇచ్చిన అక్కడి రైతుల గడిచిన 300 రోజులుగా నిరసన చేపట్టారు. వారి గురించి ఇప్పటివరకు ఏపీ సర్కారు మాట్లాడిందే లేదు. సరిగ్గా 300 రోజుకు ఒక రోజు ముందుగా లేఖను విడుదల చేయటం ద్వారా.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలో ల్యాండ్ మార్కుగా నిలిచే 300 రోజు పక్కకు వెళ్లింది. అప్రాధాన్యమైన అంశంగా మారింది. ఇదే కాదు.. లేఖ విడుదలకు రెండు.. మూడు రోజులు ముందు ప్రధాని మోడీ భేటీని కలిసి వచ్చేలా చేయటం చూస్తే.. లేఖ విడుదలలో భారీ వ్యూహాన్ని అనుసరించినట్లుగా చెప్పాలి.
అవినీతి కేసులున్న అధినేతలపై విచారణను వెంటనే పూర్తి చేసేందుకు వీలుగా కోర్టులు సమాయుత్తం అవుతున్న వేళలోనే లేఖ విడుదల మర్మం ఏమిటి? అన్నది మరో ప్రశ్న. ఇదంతా చూసినప్పుడు అమరావతి రైతుల గోస సమాధి అయ్యేలా.. వారి తరఫున వాదన వినిపించే వారి ఉనికే ప్రశ్నార్థకం అయ్యేలా జరిపిన పావుల లెక్కలో అన్ని.. సీఎం జగన్ కు అనుకూలంగా ఉండటం గమనార్హం.