ఏపీ పర్యటక మంత్రి రోజా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆమెకు వచ్చే ఎన్నికల కోసం వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశాలు ఇక అస్సలు లేవనే చెప్పాలి. రోజాకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని ఇప్పటికే కొద్ది నెలల ముందు నుంచి సీఎం జగన్ నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. జగన్ టీమ్ చేయించిన సర్వేల్లో రోజాపై నగిరి ప్రజల్లోనే కాకుండా.. క్యాడర్ లో కూడా వ్యతిరేకత పేరుకుపోయి ఉందని జగన్ గుర్తించారు. ఆ ప్రకారం ఈసారి రోజాకు టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు.
ఇప్పుడు రోజాకు వ్యతిరేకంగా ఏకంగా బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది. తాజాగా ఓ వైసీపీ కౌన్సిలర్ రోజాపై సంచలన ఆరోపణలు బహిరంగంగా చేశారు. నగరి మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం తన దగ్గర రోజా రూ.70 లక్షలు తీసుకుందని ఆమె ఆరోపించారు. చివరికి తాను రూ.40 లక్షలు ఇచ్చానని ఆరోపించారు. మంత్రి రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డి పంపించిన వ్యక్తికి తాను మూడు విడతల్లో రూ.40 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆఖరికి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇవ్వకపోగా.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని భువనేశ్వరి ఆరోపించారు. అంతేకాక, రోజా అభివృద్ధి పనులకు కూడా అడ్డు తగులుతోందని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంతో తెర వెనక భారీ స్కెచ్ జరుగుతోందని రోజా టీమ్ ఆలోచనలో పడింది. దీనిపై జగన్ కూడా సీరియస్గా ఉన్నట్లు సమాచారం.
రోజాకి టికెట్ ఇవ్వడానికి జగన్ రెడీగా లేరని, ముఖ్యంగా స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆమెపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన ఆధీనంలో పెట్టుకోవాలని.. ఎమ్మెల్యేలు అంతా తన చెప్పుచేతల్లో ఉండాలని జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తుంటారు. అయితే, మంత్రి రోజా పార్టీలో ఎవరితోనూ సఖ్యంగా ఉండరనే వాదన ఉంది. కనీసం ఒక్క మండలం నేతను కూడా ఆమె కలుపుకుపోరని చెబుతారు. నగరి నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే.. ఆ ఐదు మండలాలకు చెందిన నేతలు రోజాకు వ్యతిరేకంగానే ఉన్నారు. నగరిలో రోజా వ్యతిరేక వర్గానికి మంత్రి పెద్దిరెడ్డి సపోర్టు ఉంది. ఆ మద్దతుతోనే, పెద్ది రెడ్డి స్కెచ్తోనే తాజాగా నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమిస్తూ జగన్ మోహన్ రెడ్డి కసరత్తులు ప్రారంభించినప్పటి నుంచి రోజాకి ఈసారి టికెట్ ఉండదని బాగా వార్తలు వస్తున్నాయి. దీనిపై రోజా కూడా చాలా సార్లు స్పందించారు. తనకు ఈసారి జగన్ టికెట్ ఇవ్వకపోయినా పర్లేదని, తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన వెంటనే ఉంటానని స్పష్టత ఇచ్చారు. తనను మంత్రిని చేసిన జగన్ కు తానెప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. నిజానికి టికెట్లు దక్కని నేతలంతా మొదట ఇలాగే చెబుతున్నా.. తర్వాత నెమ్మదిగా పరిస్థితులకు తగ్గట్లుగా జంప్ అవుతున్నారు. కానీ, రోజా అలా వైసీపీని వదిలి వేరే పార్టీల్లోకి వెళ్లే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. తన నోటి దురదతో రోజా పరిమితికి మించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను దూషించి ఎంతో అపవాదు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.