హుజురాబాద్ లో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ, టీఆర్ఎస్ నేతలు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున మండలాలు, గ్రామాల వారిగా మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకుని కులాల వారిగా, మతాల వారిగా, వర్గాల వారిగా తాయిలాలు, హామీలు ఇస్తూ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. బీజేపీ కూడా తన అభ్యర్థి ఈటెల రాజేంద్ర గెలుపు కోసం ఆపార్టీలోని ఎంపీ లు రాష్ట్ర నాయకత్వం అక్కడే తిష్ఠ వేసి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇటీవల దళితబంధు ప్రవేశపెట్టి ఎలాంటి షరతులు లేకుండా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించి ముందుగా తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో తూతూమంత్రంగా ప్రారంభించి తరువాత హుజురాబాద్ లో అట్టహాసంగా ప్రారంభించి 25 మంది లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కెసిఆర్ దళిత ద్రోహి, దళితులకు ఇచ్చిన హామీలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు ఇస్తానన్న మూడెకరాల ఇంతవరకు ఇవ్వలేదని డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదని కేసీఆర్ దళిత ద్రోహి అని హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పెట్టారని, ఎన్నికలు అయిపోయాక దళిత బంధు ను బొంద పెడతాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలు కూడా కేసీఆర్ ఈ పథకాన్ని ఎంత వరకూ అమలు పరుస్తాడో అర్థంకాని స్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో లక్ష కోట్లు కేటాయించి రాష్ట్రంలోని దళితులందరికి దళిత బంధు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ఆ ఇద్దరికి ఇలా చెక్
హుజురాబాద్ ఎన్నిక తరువాత దళితబంధు ఇక ఉండదు అనే అభిప్రాయానికి చెక్ పెడుతూ, విపక్ష పార్టీ నాయకుల నోళ్లు మూయించేందుకు దళితబంధు పథకాన్ని రాష్ట్ర నలు దిక్కుల నుండి నాలుగు మండలాల్లో అమలు పరిచేందుకు కేసిఆర్ ప్లాన్ వేసారు . టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళిత, గిరిజన దండోరా సభలు పెట్టి కేసీఆర్ దళిత ద్రోహి అంటూ ఆరోపిస్తున్నారు. రేవంత్ నోరు మూయించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, చారగొండ మండలం ఒకటి. అచ్చంపేట నియజకవర్గం, కొందరెడ్డిపల్లినే రేవంత్ రెడ్డి సొంతూరు. అందుకే రేవంత్ రెడ్డి సొంత మండలాన్ని ఎంపిక చేశారు అని చెపుతున్నారు. రేవంత్ సొంత ఊర్లోనే దళితబంధు అమలు చేస్తే రేవంత్ నోరు మూయించొచ్చు అని కేసీఆర్ ఎత్తుగడ. అలాగే కోమటిరెడ్డి దళితబంధు కోసం మేము రాజీనామా చేస్తామని చెప్పడం, దళిత దీక్షలు చేస్తుండడంతో…వారి విమర్శలకు చెక్ పెట్టడానికి వారి అడ్డా అయిన నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం లో దళితబంధు అమలు పరచనున్నారు.
మరో ఇద్దరిపైనా అదే అస్త్రం
తెలంగాణ బీజేపీ సారధి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో దళితబంధు పైలెట్ ప్రాజెక్టు కాగా, మరో మండలం నిజామాబాద్ జిల్లా, జుక్కల్ నియోజకవర్గం, నిజాం సాగర్ మండలాన్ని ఎంపిక చేశారు. ఈ మండల ఎంపికతో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అరవింద్ ను, అలాగే రేవంత్ సన్నిహితుడు అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ కూడా చెక్ పెట్టొచ్చు అని అభిప్రాయం. కాంగ్రెస్ దళితనేత మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిర లోని చింతకాయ మండలాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి నాలుగు దిక్కులలో నాలుగు మండలాలలో దళితబంధు పధకం అమలు చేసి వారి నోటికి చెక్ పెట్టాలని కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. మరి కేసీఆర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
Must Read ;- రేవంత్కు కేసీఆర్ ఇలా బ్రేకులేస్తారట