తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు… వరుసగా రెండో పర్యాయం కూడా సీఎం కుర్చీని అలవోకగానే అందుకున్నారు. తన రెండో దఫా పాలనలో ఆదివారానికి ఆయన రెండేళ్ల పాలనను కూడా పూర్తి చేసుకున్నారు. తొలి విడతలో దక్కిన అధికారాన్ని పూర్తిగానే అనుభవించని కేసీఆర్… ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లిపోయారు. తనకు ఉన్న అనుకూల పరిస్థితులను క్యాష్ చేసుకుని ఈజీగా విజయం సాధించవచ్చనే లెక్కలేసుకున్న కేసీఆర్… అందులో సత్ఫలితాలనే సాధించారని చెప్పాలి. తొలి నాలుగున్నరేళ్ల పాలనలో పెద్దగా ప్రతిబంధకాలు లేకుండానే పాలన సాగించిన కేసీఆర్ కొత్త పథకాలతో జనరంజకంగానే పాలన సాగించారు. రెండో దఫా సీఎం అయిన తర్వాత కేసీఆర్ పాలనలో జోష్ తగ్గిన వైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
తగ్గుతున్న సానుకూల ఫలితాలు
2014లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్… తొలి నాలుగున్నరేళ్ల పాలనలో సంచలన పథకాలు ప్రారంబించి రెండో దఫా ప్రభుత్వ ఏర్పాటులో నల్లేరుపై నడక మాదిరిగానే సాగిపోయారు. రెండో టెర్మ్ ఈ పాలనకు ఇప్పుడు రెండేళ్లు పూర్తి కాగా… మునుపటిలా అన్నీ సానుకూల ఫలితాలు వస్తున్న దాఖలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పరిష్కారం లేని సమస్యలతో పాటు విపక్షాల నుంచి ఎప్పటికప్పుడు పెను షాకులే ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి బీజేపీ రూపంలో దూసుకువస్తున్న ముప్పు ఎలా ఉంటుందో ఈ రెండేళ్ల కాలంలోనే కేసీఆర్ ప్రత్యక్షంగానే తెలుసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధం వల్ల బలహీనపడిపోతూ ఉండగా.. బండి సంజయ్ నేతృత్వంలో బరిలోకి దిగిన బీజేపీ కేసీఆర్కు పెను సవాళ్లనే విసురుతోందని చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు గట్టి షాకిచ్చిన బీజేపీ…. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో మరింత గట్టి దెబ్బ కొట్టింది.
Must Read ;- ప్రజలకిచ్చిన మాట.. హస్తినలో మరచిన కేసీఆర్!
రైతు బంధుతో మంచి మైలేజి
తొలి దఫా పాలనలో రైతు బంధు లాంటి సంచలన పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్… ప్రజల్లో మంచి మైలేజీని సంపాదించారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శరవేగంగా చేపట్టిన తీరుతోనూ కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పెరిగి పోయింది. ఈ తరహా పరిణామాలతో రెండో సారి ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ సునాయసంగానే విజయం సాధించింది. రెండో దఫా ఎన్నికలకు ముందు విపక్షాలుగా ఉన్న కాంగ్రెస్తో పాటు టీడీపీని బలంగా దెబ్బ కొట్టిన కేసీఆర్.. రాష్ట్రంలో విపక్షం అన్న మాటే లేకుండా చూసుకోగలిగారు. అప్పటికి బీజేపీ అంతగా బలోపేతం కాకపోయిన వైనం కూడా కేసీఆర్కు కలిసి వచ్చిందనే చెప్పాలి. మొత్తంగా తనకు ప్రత్యామ్నాయం అన్న మాట కనిపించకుండా చేయగలిగిన కేసీఆర్… రాష్ట్రంలో రెండో సారి తన పాలనకు మార్గం సుగమం చేసుకున్నారు.
షాకుల మీద షాకులు
తన రెండో టెర్మ్ పాలనలో రెండేళ్లు పూర్తి చేసుకున్న కేసీఆర్కు ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీఆర్ఎస్కు ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ తెలంగాణలో పూర్తిగా కనుమరుగు కాగా… ఏదో అలా ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా సాగుతున్న కాంగ్రెస్ను కేసీఆర్ మరింత బలహీనం చేసి పారేశారు. ఇలాంటి తరుణంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ పుంజుకోవడం, తెలంగాణలో ఏకంగా 4 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న తీరును కేసీఆర్ పెద్ద ప్రమాదంగా గుర్తించ లేకపోయారు. ఇదే అదనుగా అప్పటి దాకా తెలంగాణ చీఫ్గా కొనసాగుతున్న లక్ష్మణ్ను తప్పించిన బీజేపీ… ఆ స్థానంలో దూకుడుగా సాగుతారని భావించిన బండి సంజయ్కు పగ్గాలు అప్పగించింది. బీజేపీ అధిష్ఠానం ఆశించినట్టుగానే బండి సంజయ్ తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కేసీఆర్ను చావుదెబ్బ కొట్టిన బండి సంజయ్.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించుకున్నారు. ఈ షాక్ నుంచి తేరుకునేలోగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు మరో షాకిచ్చిన బీజేపీ… ఏకంగా 48 డివిజన్లను గెలుచుకుని సత్తా చాటింది.
అంతర్గత ఘర్షణలు
తెలంగాణలో బీజేపీ ఎదుగుతున్న తీరు చూస్తుంటే… మరో మూడేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడక ఎంతమాత్రం కాబోదని చెప్పక తప్పదు. అదే సమయంలో తన పాత పథకాలను కొనసాగిస్తూనే ధరణి తరహా కొత్త పథకాలను ప్రారంభించిన కేసీఆర్ వాటి అమలులో మాత్రం మునుపటి దూకుడును చూపలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పార్టీలో కొనసాగుతున్న అంతర్గత ఘర్షణలు కూడా కేసీఆర్కు కునుకు పట్టనీయడం లేదన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మేనల్లుడు తన్నీరు హరీశ్రావును దూరం పెట్టేసిన కేసీఆర్ తీరుపైనా ఇంటా బయటా పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి. గెలిస్తే తన కుమారుడి సత్తా… ఓడిపోతే హరీశ్ చేతగాని తనం, పార్టీ కేడర్ అసమర్థత అన్న రీతిలో సాగతున్న కేసీఆర్ తీరుపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీకి మూడో సారి ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉన్నా… బీజేపీ దూకుడును చూస్తుంటే… ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం కష్టమేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Also Read ;- పొత్తు తప్పదా.. బీజేపీ ట్రాప్లో కేసీఆర్, ఎంఐఎం పడినట్టే..