అమరావతి రాజధానిని చంపేందుకు వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. ఒక మంత్రి అమరావతి కమ్మ సామాజిక వర్గ రాజధాని అని, వారి భూముల ధరలు పెంచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్కడ రాజధాని పెట్టారని బహిరంగంగానే ప్రకటించారు. మరోసారి అమరావతి ముంపు ప్రాంతమని నమ్మించే ప్రయత్నం చేశారు.
16 నెలల వైసీపీ పాలనలో 12 సార్లు కృష్ణా నదికి వరద వచ్చినా రాజధానిలో ఒక్కగ్రామం కాదు కదా, ఒక్క ఇళ్లు కూడా మునగలేదు. దీంతో అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్నీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానులని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలులో న్యాయరాజధాని అని, అమరావతి లెజిస్లేటివ్ రాజధాని అని, విశాఖ పాలనా రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో పది నెలలుగా ఏపీలో రాజధాని రగడ సద్దుమణగలేదు.
అమరావతిలో ఏ సామాజికవర్గం ఎంత మంది
అమరావతి రాజధాని కోసం భూములు సేకరించిన 29 గ్రామాల్లో 32 శాతం మంది ఎస్సీ,ఎస్టీలు, 23 శాతం రెడ్లు, 18 శాతం కమ్మలు, 14 శాతం బీసీలు, 9 శాతం కాపులు, 3 శాతం మైనారిటీలు, 1 శాతం ఇతరులు ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఇవన్నీ తోసిరాజని అమరావతిలో కమ్మ ప్రాబల్యం ఎక్కువగా ఉందని, ఇక్కడ రాజధాని అభివృద్ధి చేస్తే వారి భూముల ధరలకు రెక్కలు వస్తాయని వైసీసీ భావిస్తోంది.
ఇదే జరిగితే టీడీపీని ఎన్నికల్లో ఎదుర్కోవడం కష్టం అవుతుందని వారి అంచనా. అందుకే అమరావతిలో అసలు రాజధాని లేకుండా చేయాలని వైసీపీ నేతలు స్కెచ్ వేశారు. అందుకే కాసేపు అమరావతి ముంపు ప్రాంతమని, మరికాసేపు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా వికేంద్రీకరణ అని, అమరావతిలో భవనాలు నిర్మించాలంటే 100 అడుగుల లోతు పునాదులు తీయాల్సి ఉంటుందని, ఇక్కడ రూపాయి పెట్టినా నష్టమేనని అనేక విధాలుగా ప్రచారం చేశారు. ఏదో ఒకటి చేసి అమరావతిలో అసలు రాజధాని లేకుండా చేయడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.
అమరావతి నిజంగా రాజధానికి పనికిరాదా?
నాలుగు చినుకులకే హైదరాబాద్ రహదారులు నదులను తలపిస్తున్నాయి. రెండేళ్ల కిందట వచ్చిన వరదలకు చెన్నై అతలాకుతలం అయింది. ఇక ముంబయి ఏటా మునుగుతూనే ఉంది. వీటితో పోల్చుకుంటే అమరావతి చాలా సేఫ్. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. 2014లో వచ్చిన హుదూద్ తుఫాను నుంచి కోలుకోవడానకి విశాఖ ప్రజలకు చాలా కాలం పట్టింది. విశాఖతో పోల్చుకుంటే అమరావతి రాజధానికి సరైన ఎంపిక అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అమరావతి ఏపీ ప్రజలందరికీ సమాన దూరంలో ఉండటం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పటికే తమిళనాడులోని దక్షణాది జిల్లాల వారు తమకు చెన్నై దూరం అవుతోందని, తిరుచిరాపల్లిని రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రజలు మరో రాజధాని డిమాండ్ చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఎలా ఆలోచించినా అమరావతి రాజధానికి సరైన స్థలంగా చెప్పవచ్చు.
అమరావతి అందరిదీ…
వైసీపీ నేతలు చెప్పినట్టు రాజధానిలో కమ్మ సామాజికవర్గం ప్రజలు ఎక్కవగా లేరు. వీరికంటే చాలా కులాల వారి జనాభానే ఎక్కువగా ఉంది. రాజధాని ఒక్కసారి ప్రారంభం అయితే అనేక కులాలు, మతాల వారు నివాసం ఏర్పాటు చేసుకుంటారు. రాజధానిలో ఎవరికి ఉపాధి దొరికితే వారు నివాసం ఏర్పాటు చేసుకుంటారు. రాజధాని అభివృద్ధి చెందుతూ ఉంటే జనాభా పెరుగుతూ ఉంటుంది. కులాలకు, మతాలకు అతీతంగా కేవలం ఉపాధి కల్పించే కల్పతరువుగా రాజధాని మారుతుంది. నేడు హైదరాబాద్ నగరం ఏ కులం వారిది అంటే చెప్పడం సాధ్యం అవుతుందా. అయినా రాజధానికి కులం ముద్రవేయడం మతిలేని చర్య.
రైతులతో ఒప్పందాలు ఎలా రద్దవుతాయి
గత ప్రభుత్వం రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించింది. రైతులు ఇచ్చిన భూమిలో 25 శాతం వారికి తిరిగి ఇచ్చారు. ఆ భూమిని అభివృద్ధి చేయాల్సి ఉంది. అందుకుగాను సీఆర్డీయేని ఏర్పాటు చేసి రైతులతో ఒప్పందం చేసుకున్నారు. రైతులు 75 శాతం భూమి కోల్పోయినా, మిగిలిన 25 శాతం భూమికి మంచి ధర వస్తుందని తమ బతుకులు మారతాయని ప్రభుత్వంపై నమ్మకంతో భూములు ఇచ్చారు. ప్రభుత్వం మారగానే చట్టాలు రద్దు చేసి, రైతులతో చేసుకున్న ఒప్పందాలు ఉల్లంఘిస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు. రైతులతో చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకోవాలంటే వారికి రూ.4 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే అమరావతి రైతులకు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఇంత భారీ పరిహారం చెల్లించే అవకాశమే లేదు. అంటే అమరావతి రాజధానిని కదిలించడం సాధ్యం కాదని న్యాయనిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పటికైనా అమరావతిపై కుల ముద్రలు వేయడం మానాలని వారు హితవు పలుకుతున్నారు.