చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అవగానే అమరావతికి మహార్దశ పట్టింది. వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఓ వైపు వరుస కడుతుండగా.. జాతీయ స్థాయి సంస్థలు సైతం తమ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. నిజానికి 2019కి ముందే ఈ జాతీయ సంస్థలు, భారీ కంపెనీలు అమరావతిలో, ఏపీలో తమ శాఖల ఏర్పాటుకు ముందుకు రాగా, వైఎస్ జగన్ తెలివితక్కువ నిర్ణయాల కారణంగా వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మళ్లీ కొత్త కంపెనీల సందడి మొదలైంది.
అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు తాజాగా నిర్ణయం అయింది. సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల భేటీ అయ్యారు. అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ముందుకొచ్చింది. దీనిపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. సీఆర్డీఏ పరిధిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లా యూనివర్శిటీ ఏర్పాటుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. న్యాయ సంబంధిత రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు బీసీఐ ఏర్పాటు చేసే యూనివర్శిటీల ఆవశ్యకత ఎంతో ఉందని.. సీఎం అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన అర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు బీసీఐ దోహదపడుతుందని చంద్రబాబు కొనియాడారు.
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో 1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, 2022లో గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు అయ్యాయి. అవి రెండూ ప్రతిష్ఠాత్మక సంస్థలుగా ఎదిగాయి. ఇప్పుడు అదే తరహాలో అమరావతిలో బీసీఐ ట్రస్ట్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయనుందని చంద్రబాబు ఓ ట్వీ్ట్ కూడా చేశారు.
అమరావతిలో ఐకానిక్ భవనంగా నిర్మించబోతున్న హైకోర్టుకు దగ్గర్లోనే న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బీసీఐ స్థలం కోరినట్లు సమాచారం. యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చంద్రబాబు కూడా హామీ ఇచ్చినట్టు బీసీఐ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ రామిరెడ్డి వెల్లడించారు.